మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ముస్లింలు సన్నాహాలు చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ముస్లింలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకల నేపథ్యంలో పాత నగ రం ఆకుపచ్చగా ముస్తాబైంది. ముఖ్య కూడళ్లలో ఆకుపచ్చ తోరణాలు, జెండాలు, బ్యానర్లతో అందంగా అలంకరించారు. రోడ్డు మధ్యలో తాత్కాలిక వాటర్ ఫౌంటేన్లు, రంగు రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన చార్మినార్ నమూనా ఆకట్టుకుంటోంది. మక్కా మసీదు కొత్త కాంతులు సంతరించుకుంది.
నేడు ర్యాలీలు-సభలు
మిలాద్-ఉన్-నబి సందర్భంగా ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. పాతబస్తీలోని మక్కా మసీదు, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలు పెద్ద ఎత్తున కొనసాగనున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్ తామీర్-ఏ -మిల్లత్ ఆధ్వర్యంలో స్థానిక నిజాం గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు.
రాత్రికి దారుస్సలాంలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో నాతియా-ముషాయిరా కార్యక్రమం జరుగనుంది. దేశ నలుమూలల నుంచి అతిథులు హజరు కానున్నారు. మక్కా మసీదు, మొగల్పురా, ఖిల్వత్ మైదానం, కులీకుతుబ్షా స్టేడియం తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేయనున్నారు.
దారుస్సలాంలో...
ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆధ్వర్యంలో దారుస్సలాంలో శనివా రం రాత్రి మిలాద్-ఉన్-నబి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీలంకకు చెందిన ఇస్లామిక్ స్కాలర్ మౌలానా హఫీజ్ ఇషాన్ ఇక్బాల్ ఖాద్రీ, హైదారాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ప్రసంగించారు.


