‘మార్కెట్’ కుర్చీ కోసం ఆరాటం | Market Committees Chairman The post Competitive hopefuls | Sakshi
Sakshi News home page

‘మార్కెట్’ కుర్చీ కోసం ఆరాటం

May 12 2015 5:20 AM | Updated on Mar 28 2018 11:08 AM

చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్ల చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు...

- మార్కెట్ కమిటీల చైర్మన్ పదవి కోసం ఆశావహుల పోటాపోటీ
- మంత్రి హరీష్‌రావుకు నేడు స్వాగతం పలికేందుకు పోటాపోటీ ఏర్పాట్లు
చేవెళ్ల:
చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్ల చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. చేవెళ్లలోని మార్కెట్ యార్డులో గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంగళవారం వస్తున్న మార్కెటింగ్ శాఖా మంత్రి హరీష్‌రావు, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిలను ప్రసన్నం చేసుకునేందుకు అనేక తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండళ్లలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా తెలపడంతో పలు సామాజికవర్గాల నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆశావహులు వీరే..
మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సామ మాణిక్‌రెడ్డి సైతం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతోపాటు పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడిన చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డుమెంబర్ బర్కల రాంరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, చనువల్లి రామేశ్వర్‌రెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు. రిజర్వేషన్ విధానం అమలై ఎస్సీకి దక్కితే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.వసంతం, నర్సింహులు తదితరులు పోటీలో ఉన్నారు. బీసీ అయితే మండల యూత్ నాయకులు ఎం.యాదగిరి, మీర్జాగూడ మాజీ సర్పంచ్ భీమయ్య, కె.పాండు, సత్యనారాయణగౌడ్ తదితర నేతలు పోటీలో ఉన్నారు. సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం జనరల్ కేటగిరీకి రిజర్వు అయితే షాబాద్ మండలంలోని చందనవెళ్లికి చెందిన కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కక్కులూరుకు చెందిన మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జీవన్‌రెడ్డి పోటీలో ఉన్నారు.

శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయిస్తే సంకెపల్లికి చెందిన చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవుని పరమేశ్వర్‌రెడ్డి, మహాలింగపురం గ్రామానికి చెందిన బల్వంత్‌రెడ్డి పోటీపడుతున్నారు. బీసీలకు కేటాయిస్తే శంకర్‌పల్లికి చెందినబొమ్మనగారి కృష్ణ, మోకిలకు చెందిన లింగం, ఎస్సీలకు రిజర్వు చేస్తే మహారాజ్‌పేటకు చెందిన సామయ్య, జన్వాడకు చెందిన యాదయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement