కొత్త ఏడాదిలో రైలు కూత  

Manoharabad-Gajewel Railway Line Works To Be Completed Soon - Sakshi

త్వరలో పూర్తి కానున్న   మనోహరాబాద్‌–  గజ్వేల్‌ రైల్వే లైన్‌ పనులు

రైల్వే మార్గాన్ని కాంగ్రెస్‌   తొమ్మిదేళ్లు తొక్కిపెట్టింది

రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

తూప్రాన్‌/మనోహరాబాద్‌(తూప్రాన్‌):  నూతన సంవత్సరంలో మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ మధ్యలో రైలుకూత  వినపడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి , రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ రమేశ్, డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ భూంరెడ్డితో కలిసి మనోహరాబాద్, గజ్వేల్‌ రైల్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే మార్గాన్ని తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. అలాగే మనోహరాబాద్, గజ్వేల్‌ రైల్వే లైన్‌ పనులను వేగవంతం చేయాలని సంబంధిత రైల్వే అధికారులకు సూచించారు. మనోహరాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వేగేటు వద్ద రూ.కోటి 50లక్షలతో ఆర్‌అండ్‌బీ రోడ్డు, అండర్‌బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

నిధుల ద్వారా మనోహరాబాద్‌ సమీపంలోని 12 గ్రామాల ప్రజలకు అనేక మౌలిక వసతులు కలుగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ  పనులను రానున్న మూడు నెలల్లో పూర్తిస్తామని మంత్రి చెప్పారు. మనోహరాబాద్, గజ్వేల్‌ మధ్య రైల్వేలైన్‌ 31 కిలోమీటర్లు ఉండగా ఇప్పటి వరకు భూ సేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఈ రైల్వేలైన్‌ మార్గంలో ఉన్న అటవీశాఖ భూములకు సైతం అనుమతులు పొందినట్లు ఆయన తెలిపారు. 

అన్ని రకాల అనుమతులు..

ప్రస్తుతం 17 కిలోమీటర్ల రైల్వే పనులు కూడా పూర్తి చేశామని, మరో 14 కిలోమీటర్ల మేర పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆ పనులను వేగవంతం చేయాలని రైల్వే శాఖ అధికారులను 
కోరినట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు నెలలో పనులు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తిచేస్తామని వివరించారు. ఈ రైలుమార్గం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు.  

జాతీయ రహదారులపై క్రాసింగ్‌ల కోసం ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇటీవల ఢిల్లీలో మెదక్‌ ఎంపీ  ప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ దక్షిణ మధ్య రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌తో కలిసి చర్చించి తగు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే అన్ని రకాల అనుమతులను పొందినట్లు వివరించారు.

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, తూప్రాన్, రాయపోల్‌ మండలాలకు ఉపయోగకరంగా ఉండేలా బేగంపేటలో రైల్వేస్టేషన్‌ మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్స్‌ కమిటీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, గఢా హన్మంతరావు, జెడ్పీటీసీ సుమణ పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులతోపాటు మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top