
సాక్షి, హైదరాబాద్: కొలువుల కోసం కొట్లాట సభ డిసెంబర్ 4 లేదా 5న జరుగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం చెప్పారు. కొలువుల కోసం కొట్లాట సభకు హైకోర్టు అనుమతి ఇవ్వాలని ఆదేశించిన తర్వాత శుక్రవారం ఆయన మాట్లాడుతూ... భవిష్యత్పై ఆందోళనతో, భవిష్యత్తుపై భరోసా కావాలని కొట్లాడే యువకులపై నిర్బంధం విధించాలని అనుకోవడం అప్రజాస్వామికమన్నారు. కొలువులు వస్తాయని తెలంగాణ కోసం కొట్లాడిన యువకులు, ఇప్పుడు అవి కావాలని అడిగితే తప్పా... అని ప్రశ్నించారు.
నిరుద్యోగులపై నిర్బంధం విధిస్తున్న ప్రభుత్వం విలాసాలకు, పెడదోవ పట్టించే కార్యక్రమాలకు మాత్రం అండగా ఉంటుందని కోదండరాం ఆరోపించారు. సన్బర్న్ లాంటి పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమానికి అనుమతి ఇచ్చిందన్నారు. ఇలాంటి షోలకు అనుమతి రావడానికి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారి ప్రమేయమే కారణమని ఆరోపించారు. కొలువుల కోసం కొట్లాట సభకు హైకోర్టు అనుమతిని ఇవ్వడం నిరుద్యోగుల విజయమన్నారు.