మీ స్థాయికి మేం దిగజారలేం: జానా
హైదరాబాద్: వరంగల్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డిని ఇరికించడాన్ని కె.జానారెడ్డి ఖండించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడారు. రాజేందర్ రెడ్డికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని, నిందితులు ఎక్కడా ఆయన పేరు కూడా చెప్పలేదని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించటం అన్యాయం, అక్రమమన్నారు. రాజకీయ వైరుధ్యం ఉన్నంత మాత్రాన హత్యతో సంబంధం ఉందని ఆరోపించటం రాజకీయంగా కక్ష తీర్చుకోవడమేనని చెప్పారు.
1972లో తనని కూడా ఇలానే ఓ కేసులో ఇన్వాల్వ్ చేశారని గుర్తు చేశారు. కానీ కోర్టు అది అక్రమ కేసు అని తీర్పు చెప్పింది. రాజేందర్రెడ్డి విషయంపై డీజీపీకి వివరించి, న్యాయం చేయమని కోరానన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డికి టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్యతో ఎటువంటి సంబంధం లేదని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ఇట్లా చేస్తే బాగుండదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్కారం లేని నాయకుల స్థాయికి తాము దిగజారమని తెలిపారు.
సంబంధిత వార్తలు