గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: జూపల్లి | Jupally comments on Rural Development | Sakshi
Sakshi News home page

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: జూపల్లి

May 4 2018 1:46 AM | Updated on Nov 9 2018 5:56 PM

Jupally comments on Rural Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐపార్డ్‌లో గురువారం జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, మండల విస్తరణ అధికారులకు నూతన పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీరాజ్‌ చట్టం 25 ఏళ్ల కిందటే రూపొందించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాటిల్లో మార్పులు చేశామని తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ఈ చట్టం ద్వారా సర్పంచులు, పాలక వర్గాలకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, గ్రామాలకు నిధులు కూడా పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని మార్పులు చేసి అమలు చేసుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఇప్పటికే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, టీఎస్‌ఐపాస్‌ లాంటి సరికొత్త పథకాలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ పేరొందిందని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement