జూడాల ఆందోళన ఉధృతం | Junior Doctors Protest Against Violence Against Doctors | Sakshi
Sakshi News home page

జూడాల ఆందోళన ఉధృతం

Jun 15 2019 7:49 AM | Updated on Jun 15 2019 7:49 AM

Junior Doctors Protest Against Violence Against Doctors - Sakshi

గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యుల నిరసన ర్యాలీ

సుల్తాన్‌బజార్‌/గాంధీ ఆస్పత్రి:  దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలల వద్ద వైద్యులు, జూనియర్‌ డాక్టర్ల నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపుమేరకు కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, ఈఎన్‌టీ, కింగ్‌కోఠి, ఆసుపత్రుల్లో జూడాలు విధులను బహిష్కరించారు.  కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కళాశాల ఆవరణలో కట్లుకట్టుకొని వినూత్న శైలిలో ఆందోళనలు చేశారు.  జూడాల అధ్యక్షుడు అధ్యక్షుడు డాక్టర్‌ విజయేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జూడాల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం కొన్ని ఆసుపత్రుల్లో నామమాత్రం స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికి వైద్యులపై దాడులు ఆగడం లేదన్నారు.  కింగ్‌ కోఠి ఆస్పత్రిలో కూడా వైద్యులునిరసన వ్యక్తంచేశారు. 

‘గాంధీ’లో  వినూత్న నిరసన
గాంధీఆస్పత్రి : వైద్యులు, వైద్యవిద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గాంధీ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమా లు చేపట్టారు. విధులను బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.  దేశ వ్యాప్తంగా వైద్యులపై భౌతికదాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన వైద్యుడిపై కొంతమంది దాడి చేసి హత్య చేశారని, అక్కడి సీఎం మమతాబెనర్జీ రాజకీయ లబ్ధికోసం విషయాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. తెలంగాణతోపాటు నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, పేట్లబురుజు తదితర ఆస్పత్రుల్లో తరుచూ వైద్యులపై దాడులు జరుగుతు న్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. వైద్యసంఘాల ప్రతినిధులు డాక్టర్‌ పల్లం ప్రవీణ్, వసంత్‌కుమార్, అర్జున్, భూమేష్‌కుమార్, త్రిలోక్‌చందర్, లోహిత్, హర్ష, కీర్తి, చందులతోపాటు వైద్యులు, వైద్యవిద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

నిమ్స్‌లో...  
సోమాజిగూడ: నిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు.  వైద్యులపై దాడులను అరికట్టాలని, వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ రెసిడెంట్‌ వైద్యుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గౌతమ్, కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్‌ కౌశిక్, నెఫ్రాలజీ విభాగం హెడ్‌ శ్రీభూషణ్‌ రాజు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement