డీఎస్పీ యూనిఫాం.. ఇన్‌స్పెక్టర్‌ పోస్టు! | Inspectors Waiting For Postings As DSPs In Telangana | Sakshi
Sakshi News home page

Sep 10 2018 2:22 AM | Updated on Sep 10 2018 2:22 AM

Inspectors Waiting For Postings As DSPs In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో కొత్తగా పదోన్నతి పొందిన డీఎస్పీలు.. పోస్టింగ్స్‌ కోసం వేచి చూస్తున్నారు. 15 రోజుల క్రితం పదోన్నతులు వచ్చినా పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగుల్లోనే కొనసాగుతూ డీఎస్పీగా యూనిఫాం వేసుకొని ఉద్యోగం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంతో ఐపీఎస్, నాన్‌ కేడర్‌ ఎస్పీ, అదనపు ఎస్పీలను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. మూడేళ్లు ఒకే జిల్లాలో పనిచేసిన వారికి కూడా స్థానచలనం కల్పించారు. కానీ పదోన్నతి ఇచ్చిన డీఎస్పీలకు పోస్టింగ్‌ కేటాయించకపోవడం బాధిత అధికారులను ఒత్తిడికి గురి చేస్తోంది.

దాదాపు 35 మంది డీఎస్పీలు పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. శాంతి భద్రతల విభాగం పోస్టింగ్స్‌ అవసరం లేదని, ఏ లూప్‌లైన్‌ వింగ్‌లోనైనా త్వరగా పోస్టింగ్స్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులను అధికారులు కోరుతున్నారు.  ఇటీవల 16 మంది డీఎస్పీలను బదిలీ చేసిన పోలీస్‌ శాఖ, ఆ అధికారుల బదిలీ స్థానాలు మారుస్తూ మళ్లీ ఆదేశాలిచ్చింది. బదిలీ చేసిన స్థానాల్లో మళ్లీ మార్పులెందుకు జరిగాయని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్లే మార్పులు జరిగి ఉంటాయాని చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌లో ఏళ్ల పాటు పనిచేసి డీఎస్పీ పదోన్నతి తర్వాత జిల్లాలకు వెళ్లిన వారంతా మళ్లీ పాత ప్రాంతాల్లోనే పోస్టింగ్‌ దక్కించుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement