పెరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫీజు | Increased JEE Advanced Examination Fee | Sakshi
Sakshi News home page

పెరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫీజు

Nov 1 2017 2:15 AM | Updated on Oct 1 2018 5:40 PM

Increased JEE Advanced Examination Fee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2018 పరీక్ష ఫీజు పెరిగింది. గతేడాది ఫీజు కంటే ఈసారి రూ.200 వరకు అదనంగా ఫీజును పెంచినట్లు ఐఐటీ కాన్పూర్‌ తెలిపింది. సాధారణంగా గత పరీక్ష ఫీజుపై రూ.100 పెంచగా, అదనంగా జీఎస్టీ ఉంటుందని పేర్కొంది. 2018 మే 20న నిర్వహించనున్న ఈ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్న నేపథ్యంలో, జీఎస్టీ కారణంగా ఈ మేరకు పరీక్ష ఫీజు పెంచాల్సి వచ్చినట్లు వెల్లడించింది.

ఈ ఫీజు పెంపు ప్రభావం 2.24 లక్షల మందిపై పడనుంది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫీజును పెంచేందుకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. 2018 ఏప్రిల్‌ 8న నిర్వహించనున్న ఈ పరీక్షకు దాదాపు 13 లక్షల మంది హాజరుకానున్నారు. జీఎస్టీ నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫీజును కూడా పెంచనున్నట్లు సమాచారం. అయితే నవంబర్‌లో జారీ చేయనున్న ఇన్ఫర్మేషన్‌ బ్రోచర్‌లో ఫీజుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement