‘వైద్యులకు అండగా ఉంటాం’
మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్
కరీంనగర్లో అట్టహాసంగా ఐఎంఏ రాష్ట్ర సదస్సు
కరీంనగర్ టౌన్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర సదస్సు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యులు తరలివచ్చారు. వైద్యరంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకనుగుణంగా వైద్య సేవలు అందించడం, వైద్యులపై జరు గుతున్న దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలపై ఆయా విభాగాల నిపుణులు చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. కరీంనగర్కు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు ఎడవెల్లి విజయేందర్రెడ్డి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. వైద్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఈటల హామీ ఇచ్చారు. ప్రస్తుత కాలంలో మనిషికి అన్నం ఎంత అవసరమో, వైద్యం కూడా అంతే అవసరమైందని అన్నారు.