కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి | heavy rally with thousands of supporters | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి

Apr 7 2014 11:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా ఎడ్లబండిపై వచ్చి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. అంతకు ముందు శాస్తా గార్డెన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈసీ శేఖర్‌గౌడ్ మాట్లాడారు. అసమర్థ కాంగ్రెస్‌ను, ప్రతిపక్ష పార్టీగా ఘోరంగా విఫలమైన టీడీపీని ప్రజలు ఓడించాలన్నారు.

 పెద్ద చెరువును కృష్ణా జలాలతో నింపుతానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మంచిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నాయిని సుదర్శన్‌రెడ్డి, మూల హరీశ్‌గౌడ్, కె.అమృతాసాగర్, యు.సతీష్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, బొక్క జంగారెడ్డి, పల్లె సాయిబాబాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మోతీరాంనాయక్, ఎం.జంగయ్యగౌడ్, కందాల శ్రీకాంత్‌రెడ్డి, దొండ వినోద్‌రెడ్డి, దంతూరి రంగయ్యగౌడ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 జనసంద్రమైన పట్నం..
 ఈసీ శేఖర్‌గౌడ్ నామినేషన్ వేయడానికి వేలాది మందితో భారీ ర్యాలీగా తరలిరావడంతో పట్నం జనసంద్రంగా మారింది. ఎడ్ల బండిని నడిపిస్తూ శేఖర్‌గౌడ్ అందరినీ ఆకర్శించారు. శాస్తా గార్డెన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి శే ఖర్‌గౌడ్ పూలమాల వేశారు. ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు బాజా భజంత్రీలతోపాటు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement