న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరు : జీవీఎల్‌ | GVL Narasimharao fires on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరు : జీవీఎల్‌

Sep 14 2018 7:27 PM | Updated on Sep 14 2018 8:54 PM

GVL Narasimharao fires on Chandrababu naidu - Sakshi

సాక్షి, ఢిల్లీ : తెలుగుదేశం నేతలు మరోసారి డ్రామాలకు తెరతీశారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 2010లో చేసిన దొంగపోరాటంపై కేసుపెట్టింది కాంగ్రెస్‌ పార్టీనే తప్ప బీజేపీ కాదన్నారు. గతంలో 22 నోటీసులు ఇచ్చినా చంద్రబాబు స్పందించకపోవడంతోనే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ ఇచ్చారన్నారు. అది ఒక న్యాయ ప్రక్రియ మాతమే తప్ప అందులో రాజకీయాలు లేవన్నారు. నోటీసులు చూసి చంద్రబాబు భయపడే రకం కాదని తెలిపారు. ఇవన్నీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే అని ఎద్దేవా చేశారు. కోర్టు నోటీసులను కూడా పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీని వాటేసుకుని డ్యూయెట్‌లు పాడుకుంటున్నారని, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. అప్పుడు మహారాష్ట్ర పోలీస్‌లు దురుసుగా ప్రవర్తించారని, అదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. కేసులు తనపై రాకుండా అన్ని తంత్రాలు చంద్రబాబు చేస్తూనే ఉంటారన్నారు.

చంద్రబాబుపై కక్ష సాధింపు అవసరం బీజేపీకి లేదని జీవీఎల్‌ అన్నారు. ప్రజలే అతనికి బుద్ధి చెప్తారన్నారు. న్యాయపోరాటం చెయ్యాలి తప్ప, న్యాయవ్యవస్థపై బురద చల్లడం సరికాదని, న్యాయం నుంచి ఎవరు తప్పించుకోలేరని తెలిపారు. ఓటుకి నోటుకు కేసులో బహిరంగంగా పట్టుబడిన బాబు, దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పీడీ అకౌంట్స్ విషయంలో సీబీఐ ఎంక్వైరీ చేస్తే బాబు .. అవినీతి బాగోతం బయటకు వస్తుందని ధ్వజమెత్తారు. సినిమా నటుడు శివాజీకి వేశాలు లేకపోవడం వల్లే ప్యాకేజీ తీసుకొని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై బాబుకు ఎప్పుడు చిత్త శుద్ధి లేదని, అయన నీటి కోసము పోరాడటం ఏంటని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement