జాతీయ స్థాయిలో ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణపై
పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లాలకు కేంద్రం అవార్డులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జాతీయ స్థాయిలో ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో జిల్లా ముందంజలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పాలనా వ్యవహారాల, సంస్కరణల శాఖ కార్యదర్శి దేవేంద్ర చౌదరి జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థుల హాజరుశాతం వంటి 8 అంశాలపై సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన కేంద్రం ‘స్వచ్ఛ విద్యాలయ’ అవార్డుకు జిల్లా పేరును తుది ఎంపిక జాబితాలో చేర్చింది.
పరిపాలనలో మెరుగైన సేవలందించిన జిల్లాలకు అక్టోబర్లో ప్రధాని పురస్కారాలను ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛ విద్యాలయ, సాయిల్ హెల్త్కార్డు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకు ఈ అవార్డులను అందించనుంది. ఇందులో భాగంగా పథకాల అమలు, పురోగతిని ఆవిష్కరిస్తూ నివేదికలు పంపాలని జిల్లా కలెక్టర్లను కేంద్రం ఆదేశించింది. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన అమలులోనూ జిల్లా యంత్రాంగం ప్రతిభ కనబరిచింది. మార్చిలో అవార్డుల తుది జాబితాను ప్రకటించే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.