
శ్రీనివాస కల్యాణం
భెల్ టౌన్షిప్లోని అంబేద్కర్ స్టేడియం శ్రీనివాసుని సంకీర్తనలతో మార్మోగింది. గోవిందనామ ప్రతిధ్వనించింది. నిత్యం తిరుమల గిరులలో ప్రతిధ్వనించే నారాయణ మంత్రంతో హోరెత్తింది.
భెల్ టౌన్షిప్లోని అంబేద్కర్ స్టేడియం శ్రీనివాసుని సంకీర్తనలతో మార్మోగింది. గోవిందనామ ప్రతిధ్వనించింది. నిత్యం తిరుమల గిరులలో ప్రతిధ్వనించే నారాయణ మంత్రంతో హోరెత్తింది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరునికి ప్రీతికరమైనశనివారం అధ్యాత్మిక సాగరంలో మునిగిపోయింది. బెల్ టౌన్షిప్లోని దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో టీటీడీ అర్చకులు నిర్వహించిన శ్రీనివాస కల్యాణం సందర్భంగా భక్తిపారవశ్యం నెలకొంది. సుమారు 15 వేల మంది భక్తులు విచ్చేసి కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు.
రామచంద్రాపురం: భెల్ టౌన్షిప్లోని అంబేద్కర్ స్టేడియంలో శనివారం సాయంత్రం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులతో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకు వచ్చిన ఉత్సవ విగ్రహాలతో టీటీడీ అర్చకులు కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భెల్ సీఎండీ ప్రసాద్రావు, డెరైక్టర్ ఆర్.కృష్ణన్, బాజ్పాయ్, ఆర్సీపురం ఈడీలు రవిచంద్రన్, ఎంకె శర్మ పాల్గొన్నారు.
కల్యాణానికి ముందు శ్రీనివాస సంకీర్తనలు, భజనలతో స్టేడియం మార్మోగింది. కల్యాణ మహోత్సవంతో పండగ వాతావరణం కనిపించింది. కల్యాణ మహోత్సవంలో భెల్ టౌన్షిప్తో పాటు పరిసరాల ప్రాంతాల నుంచి సుమారు 15 వేల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఉత్సవాన్ని కన్నులార చూసేలా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శ్రీనివాస పద్మావతి దేవి కల్యాణం సుమారు 4 గంటల పాటు కొనసాగింది.
తిరుపతి పుణ్యక్షేత్రంలో కల్యాణం చూసినట్లు ఉంది
తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణాన్ని చూసినట్టుగా ఉందని పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కల్యాణ మహోత్సవం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామచంద్రాపురం పోలీసులు, భెల్ సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ బందో బస్తు ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వచ్చే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతనే లోపలికి అనుమతిచ్చారు.