వెంకయ్యపై జానా పొగడ్తలేల..? | Dissatisfaction with Congress to attend KJANARDEDI for the spiritual blend | Sakshi
Sakshi News home page

వెంకయ్యపై జానా పొగడ్తలేల..?

Jul 29 2017 2:45 AM | Updated on Apr 6 2019 9:15 PM

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి సీఎల్పీ నేత కె.జానారెడ్డి హాజరుకావడంపై కాంగ్రెస్‌లో విస్మయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌ ముఖ్యుల విస్మయం
సాక్షి, హైదరాబాద్‌: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి సీఎల్పీ నేత కె.జానారెడ్డి హాజరుకావడంపై కాంగ్రెస్‌లో విస్మయం వ్యక్తమవుతోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ పోటీలో ఉన్న సమయంలో బీజేపీ అభ్యర్థి వెంకయ్యపై జానా పొగడ్తలను కురిపించడంపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘వెంకయ్య ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థి మాత్రమే, ఇంకా ఉప రాష్ట్రపతి కాలేదు.

ఫలితాలెలా ఉన్నా కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థి కోసం ఎంపీలతో సభలు, సమావేశాలు పెడుతూ కాంగ్రెస్‌ అధిష్టానం సైద్ధాంతిక పోరాటం చేస్తోంది. ఈ సమయంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని పొగిడి రావడంలో జానా ఆంతర్యమేమిటి? దీనిపై శ్రేణులకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నాం’ అని ముఖ్య నాయకుడొకరు ప్రశ్నించారు. ఈ అంశంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలేమిటి? జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు 5 రూపాయల భోజనాన్ని తిని టీఆర్‌ఎస్‌కు లాభం చేశారని ఇప్పటికే విమర్శలున్నాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిపై పొగడ్తలను కురిపించి ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారు? దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయకుండా ఉండాలా? ఈ చర్యను అధిష్టానం ఉపేక్షిస్తుందా?’ అని మరో కాంగ్రెస్‌ నేత ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement