మినహాయింపునిచ్చినా ఇబ్బందులే!

Coronavirus: IT Employees Facing Huge Troubles With Police checking - Sakshi

విధులకు హాజరయ్యేందుకు టెకీల తంటాలు..

తనిఖీలు చేయకుండానే దాడి చేస్తున్న పోలీసులు

పాస్‌లు జారీ చేయాలని కోరుతున్న ఐటీ ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అత్యవసర సేవలతో పాటు, ఐటీ రంగానికి మినహాయింపునిచ్చింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు (వర్క్‌ ఫ్రం హోం)ను కల్పించాలని, పరిస్థితిని బట్టి కార్యకలాపాలు నిలిపేయాలని ఐటీ కంపెనీలకు సూచించింది. హైదరాబాద్‌ కేంద్రంగా 1,283 ఐటీ కంపెనీల్లో సుమారు ఐదున్నర లక్షల మంది పనిచేస్తుండగా, ప్రభుత్వ సూచన మేరకు 70 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం విధానంలో ప నిచేస్తున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించగా, హైదరాబాద్‌లో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. మరోవైపు ప్రైవేటు వాహనాల రాకపోకలను కూడా పోలీసులు నియంత్రిస్తున్నారు. గతంలో క్యాబ్‌ల ద్వారా రవాణా సదుపాయాన్ని కల్పించిన ఐటీ సంస్థలు అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు సొంత వాహనాల్లో విధులకు రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాయి. సొంత ఖర్చుతో విధులకు హాజరయ్యేవారికి ట్రావెల్‌ అలవెన్స్‌ వేతనంతో కలిపి ఇస్తామని చెబుతోంది.  

అడుగడుగునా తనిఖీలతో ఇబ్బందులు 
ఓ వైపు ప్రజా రవాణా లేక మరోవైపు వ్యయ ప్రయాసలతో విధులకు వెళ్తున్న ఐటీ ఉద్యోగులు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, తనిఖీలతో ఇబ్బందులు పడుతున్నారు. తాము పనిచేస్తున్న ఐటీ కంపెనీల గుర్తింపు కార్డులు చూపుతున్నా విధులకు అనుమతించడం లేదని టెకీలు చెప్తున్నా రు. సోమవారం రాత్రి విధులకు వెళ్తున్న ఇద్దరు ఐటీ ఉద్యోగులపై సైబరాబాద్‌ పోలీసులు లాఠీలు ఝళిపించారు. తమ కంపెనీ అమెరికాలోని ఓ బ్యాంకుకు ఐటీ సేవలు అందిస్తోందని చెప్పినా వినకుండా చితకబాదారని టెకీలు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశా రు. అమెజాన్, గూగుల్‌ వంటి పెద్ద కంపెనీల పేర్లు తప్ప చిన్నా, చితక ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ విధులకు వెళ్తున్న ఐటీ ఉద్యోగులు మరింత సమస్య ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీటా) ప్రతినిధులు వెల్లడించారు. వీరికి ప్రత్యేక పాస్‌లు జారీ చేయా లని టీటా అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.
 
పని సామర్థ్యంపై ఐటీ కంపెనీల ఆందోళన 
గతంలో అరుదుగా ఇంటి నుంచే ఆఫీసు పని (వర్క్‌ ఫ్రం హోం)కు అనుమతించిన ఐటీ కంపెనీలు కరోనా ప్రభావంతో మెజారిటీ ఉద్యోగులకు అవకాశం కల్పించింది. అయితే వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండటంతో పని సామర్థ్యం తగ్గి ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని ఐటీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. డేటా కనెక్టివి టీ సమస్యలు ఎదురవుతుండటంతో తరచూ అంతరాయం కలుగుతోందని టెకీలు చెప్తున్నారు. దీంతో ఉద్యోగులు సాంకేతిక సమస్యలతో పూర్తి స్థాయిలో పనిచేయలేక పోతుండటంతో కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top