
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రతి ఒక్కరూ చదివేలా చట్టం తెచ్చిన ప్రభుత్వం, అమలుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో, ఆరో తరగతిలో మొదటగా తెలుగును ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన పుస్తకాల రూపకల్పనకు చర్యలు ప్రారంభించింది.
బుధవారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పుస్తకాల రూపకల్పనకు అవసరమైన ఎడిటర్స్ కమిటీ, కంటెంట్ రైటర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాలను సమీక్షించి, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అవసరమైన మార్పులను ఈ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మరోవైపు రాష్ట్ర సిలబస్ పాఠశాలలతోపాటు ఇతర మీడియం పాఠశాలలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర సిలబస్ కలిగిన పాఠశాలల్లోనూ తెలుగు అమలుకోసం చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే చట్టానికి అనుగుణంగా నిబంధనలను జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.