దర్శనమిచ్చిన నెలవంక | CM KCR Says Ramadan Wishes To Telangana People | Sakshi
Sakshi News home page

దర్శనమిచ్చిన నెలవంక

Apr 25 2020 3:41 AM | Updated on Apr 25 2020 3:41 AM

CM KCR Says Ramadan Wishes To Telangana People - Sakshi

సామూహిక ప్రార్థనలపై ఆంక్షలు ఉండటంతో పాలస్తీనాలోని గాజాలో మౌజన్‌ ఒక్కరే ఖురాన్‌ పఠనం చేస్తున్న దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: రంజాన్‌ నెలవంక శుక్రవారం దర్శనమిచ్చిందని రుహియ్యతే హిలాల్‌ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌ పాషా ప్రకటించారు. నెలవంక దర్శనమివ్వడంతో శనివారం నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభించవచ్చన్నారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా ముస్లింలు రంజాన్‌ ఆరాధనలు తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐదు పూటల నమాజ్‌తో పాటు ఇఫ్తార్, తరావీ నమాజ్‌లను ఇళ్లలో చేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌తో చరిత్రలో తొలిసారి రంజాన్‌ సామూహిక ప్రార్థనలు మసీదుల్లో జరగడం లేదు.

సీఎం రంజాన్‌ శుభాకాంక్షలు 
పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా సీఎం కేసీఆర్‌  శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సామరస్యం, సోదరభావం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా ప్రజలు ఇళ్ల వద్దే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, రంజాన్‌ నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష  నిర్వహించారు.  కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే ముస్లింలకు అవసరమైన సరుకులు అందించడం, ఇతర అంశాలపై చర్చించారు. పోలీసుశాఖ పరంగా తీసుకుంటున్న చర్యల్ని డీజీపీ మహేందర్‌రెడ్డి హోంమంత్రికి వివరించారు. సమావేశంలో హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేశ్‌ భగవత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement