ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఏవో | CBI caught RWS DAO while taking Bribery | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఏవో

May 8 2015 2:43 AM | Updated on Sep 3 2017 1:36 AM

అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు అవినీతి చేప చిక్కింది...

- రూ.52వేలు లంచం తీసుకుంటూ..
- బిల్లు మంజూరుకు పర్సంటేజీ డిమాండ్
ఆదిలాబాద్ రూరల్ :
అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు అవినీతి చేప చిక్కింది. రూరల్ వాటర్ సప్లయ్ శాఖలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(ఆర్‌డబ్ల్యూఎస్ డీఏవో)గా పనిచేస్తున్న పిల్లి క్రాంతికుమార్ ఓ బోర్‌వెల్ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.52వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన బోర్‌వెల్ సివిల్ కాంట్రాక్టర్ నారాయణరెడ్డి రెండేళ్ల క్రితం 136 బోర్‌వెల్‌లను ఫ్లషింగ్ చేశాడు. వీటి వ్యయం రూ.6లక్షలు అయింది. పనులు పూర్తి చేసినా బిల్లు మంజూరు చేయడంలో అధికారులు జాప్యం చేశారు.

బిల్లు మంజూరు, ఇతర పనులకు సంబంధించి బిల్లుపై 7శాతం డబ్బు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను డీఏవో క్రాంతికుమార్ డిమాండ్ చేశాడు. బిల్లుపై ఏడు శాతం ఇవ్వాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడు శాతంతో రూ.42వేలు అవుతుందని, బిల్లు మంజూరు చేయడంలో తాను ఎక్కువగా శ్రమ పడాల్సి వచ్చిందని అందుకు అదనంగా మరో రూ.10వేలు ఇవ్వాలని డీఏవో డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ నారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పట్టణంలోని టీచర్స్ కాలనీలో క్రాంతికుమార్ తన ఇంట్లో గురువారం నారాయణరెడ్డి నుంచి రూ.52వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు.

జిల్లాలో అవినీతికి పాల్పడే అధికారుల సంఖ్య పెరిగిందని, వివిధ శాఖల్లో లంచం లేనిదే అధికారులు పనులు చేయడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్‌గౌ తెలిపారు. అలాంటి అధికారులపై దాడులు చేస్తామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలను మంజూరు చేయడంలో సైతం అధికారులు లబ్ధిదారుల నుంచి వేలాది రూపాయలు లంచం తీసుకుంటున్నట్లు తమ కు ఫిర్యాదులు అందయన్నారు. అవినీతికి పాల్పడే అధికారులను వదిలేది లేదని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement