మిషన్‌ భగీరథ పనులు ప్రారంభం

Bhagiratha Mission Scheme Start In Mahabubnagar - Sakshi

తాడూరు : మండల కేంద్రంలో ఇంటింటికి నల్లా కార్యక్రమంలో భాగంగా మిషన్‌ భగీరథ పనులను బుధవారం సర్పంచ్‌ యార సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి నల్లా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పనులను చేపట్టిందన్నారు. మండలంలో రూ.కోటి 30లక్షలతో 8.7 కిలోమీటర్ల పైపులైన్‌ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. సిర్సవాడ, భల్లాన్‌పల్లి, గుంతకోడూరు, యాదిరెడ్డిపల్లి, పాపగల్‌ గ్రామాలలో పనులు పూర్తయ్యాయని అన్నారు. మండలంలో 12లక్షలతో పైపులైన్‌ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మే నెల చివరి వరకు పనులను పూర్తి చేసి ఇంటింటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు యార రమేష్, నాయకులు కృష్ణయ్య, మశన్న, మల్లేష్, శంకర్, ఉప సర్పంచ్‌ శేఖర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.  
పలు గ్రామాల్లో అసంపూర్తిగా..
తెలకపల్లి : మండల కేంద్రంతోపాటు గౌరారం తదితర గ్రామాలలో మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇంటింటికి నల్లా పేరుతో పైపులైన్‌ పనులు చేపట్టారు. వాటిని పూడ్చకుండా రోజుల తరబడి ఉంచుతున్నారని, దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నారు. పైపులైన్లు పూడ్చే సమయంలో నామమాత్రంగా పూడ్చి మట్టిని వదిలేయడంతో సీసీ రోడ్లపై మట్టి పేరుకుపోయి వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని, దీనివల్ల ప్రమాదాలకు కూడా గురవుతున్నామని అంటున్నారు. మిషన్‌ భగీరథ అధికారులు వెంటనే నాణ్యతగా పనులు చేయాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top