పెరగనున్న బీటెక్‌ ఫీజు!

B Tech Fees Going To High In Telangana - Sakshi

వృత్తి విద్యాకోర్సులకు కూడా.. 

రూ.50 వేల లోపు ఫీజున్న కాలేజీల్లో 20% పెంపు.. రూ.50 వేలకు పైగా ఫీజున్న కాలేజీల్లో 15% పెంపు 

కాలేజీ యాజమాన్యాలకు ఏఎఫ్‌ఆర్‌సీ, ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన 

మెజారిటీ యాజమాన్యాలు ఓకే కోర్టు తీర్పు అమలు చేయాలనే 

కాలేజీలకు  త్వరలో ఫీజుల ఖరారు 

మరో 2 రోజులు వెబ్‌ ఆప్షన్లు వాయిదా! 

కొత్త ఫీజులు ఎంతమేర పెరుగుతాయో తెలియక గందరగోళం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్‌ తదితర వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.50 వేల లోపు వార్షిక ఫీజున్న కాలేజీల్లో 20%మేర, రూ.50 వేలకు పైగా వార్షిక ఫీజు ఉన్న కాలేజీల్లో 15% మేర ఫీజులు పెరగనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి, సాంకేతిక విద్య కాలేజీ యాజమాన్యాలతో శనివారం విశ్వేశ్వరయ్య భవన్‌లో ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ), తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్‌ గౌతంరావు, కార్యదర్శి సునీల్, వివిధ కాలేజీ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫీజుల ఖరారులో ఆలస్యం, ఫీజుల ఖరారులో న్యాయవివాదం తలెత్తడంతో యాజమాన్యాలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త ఫీజులను అమలు చేసేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఆయా కాలేజీల్లో ఉన్న ఫీజులపై 20%, 15% ఫీజులను పెంచేందుకు ఒకట్రెండు రోజుల సమయం పట్టనున్నందున.. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంజనీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను మరో రెండు మూడ్రోజులు వాయిదా వేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. కాలేజీ వారీగా ఫీజులను ఖరారు చేశాకే, వెబ్‌ ఆప్షన్లను అందుబాటులో తేవాల్సి ఉంటుంది. దీంతో.. తాజా మార్పులను దృష్టిలో ఉంచుకుని వెబ్‌ఆప్షన్లను వాయిదా వేయనున్నారు. 
 
103 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 20% 
రాష్ట్రంలో 2016–17 విద్యా సంవత్సరంలో 184 ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజులను ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. ఇందులో కనీస ఫీజు రూ.35 వేల లోపు ఉన్న కాలేజీలు 26 ఉన్నాయి. వాటితో కలుపుకొని రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీల సంఖ్య 103. ప్రస్తుతం వాటన్నింటిలో 20% ఫీజులు పెరగనున్నాయి. మిగతా 81 కాలేజీల్లో 15% ఫీజులు పెంచనున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా తదితర వృత్తి విద్యాకోర్సుల ఫీజులు కూడా ఇదే నిష్పత్తిలో (20%, 15%) పెంచేందుకు అధికారులు ఓకే చెప్పారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 విద్యా సంవత్సరం వరకు మూడేళ్లపాటు అమలు చేయాల్సిన ఫీజుల కోసం 1,235 వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలు ప్రతిపాదనలను అందజేశాయి. ప్రస్తుతం వాటన్నింటిలో ఈ పెంపు అమలు కానుంది. 
 
భారీగా పెంపుదలకు డిమాండ్‌ 
కొత్త ఫీజుల ఖరారు విషయంలో న్యాయ వివాదం నేపథ్యంలో ఫీజులను పెంచుతామని అధికారులు యాజమాన్యాల ముందు ప్రతిపాదన పెట్టగా కొన్ని కాలేజీలు 35–40% పెంచాలని డిమాండ్‌ చేశాయి. కానీ భారీగా పెంచితే వ్యతిరేకత ఎదురవుతుందన్న అభిప్రాయం కారణంగా తాజా మార్పులను ఏఎఫ్‌ఆర్‌సీ సూచించింది. దీనికి మెజారిటీ యాజమాన్యాలు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. వాస్తవానికి ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ను ముందుగా నియమించి ఉంటే, ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేసే వారు. నియామకంలో ఆలస్యం కావడం, ఫీజులను ఖరారు చేయకపోవడంతో ప్రవేశాలు మరింత జాప్యమయ్యే పరిస్థితి నెలకొనడంతో.. ఈ పెంపును అధికారులే ప్రతిపాదించారు. దీనికి కోర్టును ఆశ్రయించిన కాలేజీలు కూడా చాలా వరకు అంగీకరించాయని అధికారులు వెల్లడించారు. అంతేకాదు రాతపూర్వకంగా అంగీకారాన్ని తెలియజేశాయని పేర్కొన్నారు. 
 
కోర్టు తీర్పును కచ్చితంగా అమలు చేయాలంటే.. 
ఏఎఫ్‌ఆర్‌సీ చేసిన ప్రతిపాదనకు అంగీకరించడకుండా, కోర్టు తీర్పునే అమలు చేయాలంటే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కొత్త ఫీజు ప్రతిపాదనలు ఇచ్చిన కాలేజీల్లో కొన్ని 280% పెంపుదల కోరాయి. రూ.1,13,500 ఫీజు ఉన్న ఓ కాలేజీ రూ.3.19 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించాయి. ఇలా చాలా కాలేజీలు 200శాతానికి పైగా ఫీజులను ప్రతిపాదించాయి. అలాంటి వాటిల్లో మొదట 6 కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలుకు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత మరో 75 కాలేజీలు కోర్టుకు వెళ్లి అదే తరహా ఆర్డర్‌ తెచ్చుకున్నాయి. దీంతో వాటి సంఖ్య 81కి చేరింది. అయితే శనివారం జరిగిన సమావేశంలో ఆ కాలేజీలకు చెందిన యాజమాన్యాలు కూడా పాల్గొన్నాయి. అందులో మెజారిటీ కాలేజీలు అధికారుల ప్రతిపాదనకు అంగీకరించాయి. ఇక భారీగా ఫీజును ప్రతిపాదించిన 20 వరకు కాలేజీలు ఈ పెంపు ప్రతిపాదనను అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. వారు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరే అవకాశం ఉంది. తమ ప్రతిపాదనకు రాత పూర్వకంగా అంగీకారం తెలుపని కాలేజీలతో మరోసారి మాట్లాడి ఒప్పించాలని భావిస్తున్నారు. వారు అంగీకరించకపోతే ఆయా కాలేజీలకు ఫీజులను నిర్ధారించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎలాగూ వెబ్‌ఆప్షన్లను వాయిదా వేయాలని భావిస్తున్నందున మరికొంత సమయం దొరుకుతుంది. వెబ్‌ ఆప్షన్ల చివరి తేదీ నాటికి ఆయా కాలేజీల ఫీజులను ఖరారు చేసి కౌన్సెలింగ్‌లో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. విద్యార్థులు కొత్త ఫీజులను చూసి చివరి రోజున తమ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మిగతా అన్ని కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి కొత్త ఫీజులను నెల, రెండు నెలల రోజుల్లోఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దాంతో విద్యార్థులు ఫీజులు చెల్లించే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండబోవని అధికారులు భావిస్తున్నారు. 
 
ఫీజు తంటాలు తప్పవా? 
వెబ్‌ ఆప్షన్ల సమయంలో కాలేజీ వారీ ఫీజులను వెల్లడించాలి. వాటిని చూసే విద్యార్థులు ఆ ఫీజులను బట్టి తమకు ఇష్టమైన కాలేజీని ఎంచుకుంటారు. అయితే ఇప్పటివరకు రూ.60 వేల ఫీజు ఉన్న ఓ కాలేజీకి అధికారుల చేసిన 15% పెంపు ప్రతిపాదన ప్రకారం రూ.9 వేలు పెరుగుతుంది. ఆ కాలేజీ ఫీజు రూ.69 వేలకు చేరుకుటుంది. అయితే ఇది తాత్కాలికమే. ఆదాయ వ్యయాలను బట్టి ఆ కాలేజీ ఫీజును వచ్చే నెల రెండు నెలల్లో పూర్తిస్థాయి ఫీజును ఖరారు చేస్తారు. ఇక్కడే ఓ సమస్యుంది. ఇప్పటి వరకు రూ.60 వేల ఫీజు ఉన్న ఆ కాలేజీ కొత్త ఫీజును రెట్టింపు చేస్తూ రూ.1.20 లక్షలకు ప్రతిపాదిస్తే వాటిని ఏఎఫ్‌ఆర్‌సీ పరిశీలించనుంది. అందులో రూ.1 లక్షకు కనుక ఆ కాలేజీ ఫీజు ఖరారైతే ఆ కాలేజీలో చేరిన విద్యార్థిపై రూ.40 వేల అదనపు భారం పడనుంది. ఆ కాలేజీ ఫీజు ఇపుడు రూ.69వేలుగా చేసినా, ఆ తరువాత ఎంత వరకు పెరుగుతుందో.. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజుల నియంత్రణ కమిటీ ఎంతవరకు తగ్గిస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. విద్యార్థి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు రూ.69 వేలు మాత్రమే కనిపిస్తుంది తప్ప కచ్చితమైన ఫీజు తెలియదు. ఇలాంటి పరిస్థితి చాలా కాలేజీల విషయంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది. దీంతో ఈసారి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు ఇబ్బందులు, గందరగోళం తప్పేలా లేదు. 
 
ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలు 

బీటెక్‌–197, ఎంటెక్‌–130, ఎంబీఏ–285, ఎంసీఏ–33, బీఫార్మసీ–122, ఎంఫార్మసీ–113, ఫార్మ్‌డీ–57, ఫార్మ్‌డి (పీబీ)–28, బీఎడ్‌–196, ఎంఎడ్‌–9, బీపీఈడీ–9, డీపీడీడీ–2, ఎల్‌ఎల్‌బీ–29, ఎల్‌ఎల్‌ఎం–9, బీఆర్క్‌–9, ఎం.ఆర్క్‌–2, బీఎఫ్‌ఏ–5.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top