కంబాలపల్లిలో బాంబుల కలకలం | 59 highly explosive bomb in Kambalapalli | Sakshi
Sakshi News home page

కంబాలపల్లిలో బాంబుల కలకలం

Dec 2 2014 1:32 AM | Updated on Sep 2 2017 5:28 PM

జిల్లాలో ఫ్యాక్షన్ వాతావరణం కన్పించే ప్రాంతమైన చం దంపేట మండలం కంబాలపల్లిలో బాంబులు కలకలం రేపాయి.

 దేవరకొండ : జిల్లాలో ఫ్యాక్షన్ వాతావరణం కన్పించే ప్రాంతమైన చం దంపేట మండలం కంబాలపల్లిలో బాంబులు కలకలం రేపాయి. ఒకటి కాదు, రెండు కాదు 59 హైలీ ఎక్స్‌ప్లోజివ్ బాంబులను పోలీసులు కనుగొన్నా రు. కంబాలపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల మోద్గులబొంద సమీపంలో బయటపడ్డ డర్డీ బాంబుల ఘట నతో మళ్లీ పాత కక్షలు భగ్గుమంటాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
 
 ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ గ్రామం పలుసార్లు వార్తల్లోకెక్కింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నోసా ర్లు పాత కక్షలతో బాంబు దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. 2008లో కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య వర్గపోరుతో బాంబులు వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. 2009లో సుమారు 40 నాటు బాంబులను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. అతి కొద్ది కాలంలోనే మరోసారి  కాంగ్రెస్, టీడీపీల మధ్య ఉన్న వర్గ విభేదాలతో ఫ్యాక్షన్ రీతిలో ఒకరిపై ఒకరు బాంబు దాడులకు పాల్పడ్డారు. 2011లోనూ ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు బాంబులు వేసుకోవడంతో పలువురు గాయాలపాలయ్యారు.
 
 గతానికి భిన్నం
 గతంలో బాంబు దాడులకు పాల్పడినప్పటికీ,  అప్పుడు వేసుకున్న బాంబులు మరీ అంత ప్రమాదకరమైనవి కావు. కానీ ఈసారి బయటపడ్డ బాంబులు పొటాషియం, గంధకం, సీస పెంకులు, పదునైన గాయాలు చేసే రాళ్లతో కూడి డిటోనేటర్‌తో పేలుడుకు గురయ్యే అతి ప్రమాదకరమైన బాంబులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ బాంబులకు వాహనాలను కూడా పేల్చే సామర్థ్యం ఉంటుందని తెలియజేస్తున్నారు.
 
 జాతరే లక్ష్యమా ?
 దాచి ఉంచిన 59 నాటుబాంబులు వెలుగు చూడడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఉన్న రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల గ్రామంలో రెండు పార్టీల మధ్య ఏర్పడ్డ చిన్న వివాదం చినికిచినికి గాలి వానలా మారింది. ఒక వర్గం మరొక వర్గంపై కేసు పెట్టడంతో ఒక వర్గానికి చెందిన ఏడుగురు వారం రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు.   ఇదిలా ఉండగా ఈ రెండు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఎవరైనా నాటు బాంబులను తెప్పించి ఉంచారా అన్న అనుమానాలున్నాయి. అంతేకాక ప్రతి ఏటా కంబాలపల్లిలో మహాలక్ష్మమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు పలు జిల్లాల నుంచి కూడా జనం వస్తుంటా రు. కాగా ఈసారి ఈ జాతరను ఒక వర్గం వాయిదా వేయగా,  మరో వర్గం నిరాడంబరంగా జరుపుకున్నారు. పోలీసులు ముందస్తుగా బాంబులను గుర్తించడంతో పెనుప్రమాదమే తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement