కృష్ణా జలాలపై పాండ్యా కమిటీ | 3 member committee on krishna water issue | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలపై పాండ్యా కమిటీ

Jul 2 2016 3:43 AM | Updated on Sep 4 2017 3:54 AM

కృష్ణానదీ జలాలపై నెల కొన్న వివాదాలను కొలిక్కి తెచ్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించనున్న త్రిసభ్య కమిటీ
5న ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శుల సమావేశం!

 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై నెల కొన్న వివాదాలను కొలిక్కి తెచ్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్లు ఏకే బజాజ్, సురేష్‌చంద్ర సభ్యులుగా ఉంటారు. ఇరు రాష్ట్రాలకు కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ, కేఆర్‌ఎంబీ పరిధి, విధి విధానాల ఖరారు చేసే బాధ్యతలను ఈ కమిటీకి కట్టబెట్టింది. కమిటీ ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని తెలిసింది. కృష్ణా జలాల పం పకం, ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేకకార్యదర్శి అమర్జీత్‌సింగ్ అధ్యక్షతన ఈ నెల 21 నుంచి 23 వరకు తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రా యం కుదరని సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ నియమిస్తామని కేంద్రం తెలిపింది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ఈ కమిటీని కేంద్రం ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఈ నెల రెండో వారంలో దిగువ కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులి చింతల, ప్రకాశం బ్యారేజీ, సుంకేసుల జలాశయాలను సందర్శించనుంది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు, కృష్ణా బోర్డు ఇన్‌చార్జి చైర్మన్ రాంశరాణ్‌తో సమావేశం కానుంది. కమిటీ పర్యటనకు ముందే ఈ నెల 5న ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల సమావేశం జరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement