రుణమాఫీ రెండో ఏడాది నిధులు విడుదల | 2nd year of loan waiver funds released by Telangana govt | Sakshi
Sakshi News home page

రుణమాఫీ రెండో ఏడాది నిధులు విడుదల

Jun 21 2015 2:29 AM | Updated on Apr 7 2019 3:50 PM

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతుల రుణమాఫీ నిధులను విడుదల చేసింది.

ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతుల రుణమాఫీ నిధులను విడుదల చేసింది. తొలి ఏడాది రుణాల మాఫీ నిధులను ఒకేసారి బ్యాంకులకు విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి 2 విడతలుగా ఇవ్వాలని నిర్ణయించింది. అందులో తొలి విడతగా రూ. 2,043 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు రుణాలు రెన్యువల్ చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. మిగతా రూ. 2,207 కోట్లు వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
 
  రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసింది. మొత్తం 35.56 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 25 శాతం చొప్పున వరుసగా నాలుగేళ్లలో రుణమాఫీ నిధులను బ్యాంకులకు విడుదల చేయనుంది. తొలి ఏడాది రూ.4,086 కోట్లను బ్యాంకులకు విడుదల చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement