సమగ్ర శిక్ష నిధులను విడుదల చేయండి  | Tamil Nadu CM Stalin presses for funds under Samagra Shiksha, railway projects | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్ష నిధులను విడుదల చేయండి 

Jul 30 2025 4:10 AM | Updated on Jul 30 2025 4:10 AM

Tamil Nadu CM Stalin presses for funds under Samagra Shiksha, railway projects

ప్రధాని మోదీకి స్టాలిన్‌ విజ్ఞప్తి 

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.2,000 కోట్లకు పైగా విద్యా నిధులను వెంటనే విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని కోరారు. ప్రధానమంత్రి రెండు రోజుల తమిళనాడు పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ద్వారా స్టాలిన్‌ ఈ విజ్ఞప్తి చేశారు.

 రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను, రాజేంద్ర చోళన్‌ గౌరవార్థం ఒక స్మారక నాణెంను ప్రధాని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్‌ మోదీకి లేఖ రాశారు. ‘2018 నుంచి తమిళనాడు ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. దీని వల్ల విద్యా ఫలితాల్లో స్థిరమైన మెరుగుదలలు జరుగుతున్నాయి. 

తమిళనాడు పాఠశాల విద్యా వ్యవస్థ ప్రస్తుతం 43.90 లక్షల మంది విద్యార్థులు, 2.2 లక్షల మంది ఉపాధ్యాయులు మరియు 32,000 మందికి పైగా సహాయక సిబ్బందికి వసతి కల్పిస్తోంది. ఇంత కీలకమైన మరియు పెద్ద ఎత్తున పథకానికి నిధులను నిలిపివేయడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ నిధుల విడుదలకు కేంద్రం జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఒక ముందస్తు షరతు పెట్టింది.

 ఇందులో కొన్ని నిబంధనలకు, ముఖ్యంగా త్రిభాషా విధానాన్ని విధించడం, పాఠశాల విద్యను 5+3+3+4 ఫార్మాట్‌కు పునరి్నరి్మంచడం గురించి రాష్ట్రానికి చట్టపరమైన, విధాన ఆధారిత అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.2,149 కోట్లను వెంటనే విడుదల చేయాలి. 2025–26 సంవత్సరానికి మొదటి విడత చెల్లింపును వేగవంతం చేయాలి’అని స్టాలిన్‌ లేఖలో పేర్కొన్నారు. 

దశాబ్దం క్రితం మంజూరు చేసి, ఇంకా పెండింగ్‌లో ఉన్న బహుళ రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. అనంతరం.. ‘‘తమిళనాడు విద్యార్థుల విద్యకు నిధులు, పేద, మధ్యతరగతి ప్రజల రవాణా కోసం రైల్వే ప్రాజెక్టులు, మత్స్యకారుల జీవనోపాధి, సేలం డిఫెన్స్‌ ఇండ్రస్టియల్‌ పార్క్‌ అభివృద్ధి గురించి గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీకి మేం ఒక వినతిపత్రం సమరి్పంచాం. ప్రజల మనోభావాలకు, రాష్ట్ర అభివృద్ధికి విలువనిస్తూ ప్రధానమంత్రి తగిన పరిష్కారాలను అందిస్తారని విశ్వసిస్తున్నా’’అని స్టాలిన్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement