ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Woman Kills for Husband for Her Lover - Sakshi

కెలమంగలం : పెళ్లయిన ఆరు నెలలకే భార్య ప్రియునితో కలిసి భర్తను గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘటన డెంకణీకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని అళేనత్తం గ్రామానికి చెందిన సోమశేఖర్‌(27)కు అదే ప్రాంతానికి చెందిన శారదమ్మ(22)తో ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. సోమశేఖర్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుండేవాడు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసింది. బంధువులు సోమశేఖర్‌ మృతదేహాన్ని పరిశీలించి మృతిలో సందేహం ఉన్నట్లు డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సోమశేఖర్‌ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షలో సోమశేఖర్‌ను దుప్పటితో గొంతునులిమి హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో సోమశేఖర్‌ భార్య శారదమ్మపై అనుమానం ఏర్పడిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తీవ్ర విచారణ చేపట్టారు. శారదమ్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సోమశేఖర్‌ తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో అతని మిత్రుడైన అదే గ్రామానికి చెందిన బేటరాయన్‌తో తనకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, సోమశేఖర్‌ ఇంట్లో లేని సమయంలో బేటరాయన్‌తో ఉల్లాస జీవితం కొనసాగించినట్లు, ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో గ్రామస్థులు తన భర్త సోమశేఖర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం సోమశేఖర్‌ తనను తీవ్రంగా నిలదీశారు. దీంతో ప్రియుడు బేటరాయన్‌తో కలిసి సోమశేఖర్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాను. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బేటరాయన్, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అప్పయ్యతో కలిసి సోమశేఖర్‌ను శారదమ్మ చుడీధార్‌ దుప్పటితో గొంతునులిమి హత్య చేశామని, ఈ సమయంలో బేటరాయన్‌ తనతో ఎవరైనా అడిగితే స్పృహకోల్పోయి మృతి చెందాడని చెప్పమని తెలిపి అక్కడి నుండి వెళ్లిపోయారని శారదమ్మ పోలీసులకు వివరించింది. శారదమ్మను పోలీసులు అరెస్టు చేసి పరారీలో ఉన్న బేటరాయన్, అప్పయ్యలను గాలించి పట్టుకొన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top