జయ చికిత్స వివరాలను వెల్లడిస్తాం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో దాచి పెట్టాల్సిన విషయం ఏమీ లేదని అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో దాచి పెట్టాల్సిన విషయం ఏమీలేదని అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు. జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు గురువారం అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు.
జయలలిత చికిత్సకు సంబంధించిన విషయాలను కోర్టుకు తెలియజేస్తామని సరస్వతి చెప్పారు. జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు చేసిన చికిత్స, డిశ్చార్జి అవుతారని భావిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మరణించేవరకు.. అన్ని విషయాలను తెలియజేస్తామని తెలిపారు. ప్రతి విషయంలో పారదర్శకంగా ఉంటామని సరస్వతి చెప్పారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన విషయం విదితమే. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలను వెల్లడించాలని కోరుతూ అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


