
ఉరి వేసుకుని బుల్లితెర నటుడి ఆత్మహత్య
బుల్లి తెర నటుడు బాల మురళీ మోహన్ గురువారం చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు.
చెన్నై : బుల్లి తెర నటుడు బాల మురళీ మోహన్ గురువారం చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 54. బాల మురళీ మోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలోనూ నటించారు. హాస్యనటుడు వివేక్తో కలిసి టీవీ కార్యక్రమాల్లో నటించి ప్రాచుర్యం పొందారు. అదే విధంగా తెండ్రల్, వంశం వంటి మెగా సీరియళ్లలో ముఖ్య పాత్రలు పోషించారు. స్థానిక వలసరవాక్కంలోని రిథర్డన్ రోడ్డులో కుటుంబ సమేతంగా నివసిస్తున్న బాల మురళీ మోహన్ బుధవారం అర్ధరాత్రి తరువాత షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చారు.
గురువారం ఉదయం ఆయన గది నుంచి బయటకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెప్పేరి పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ప్రభు, సబ్ ఇన్స్పెక్టర్ త్యాగరాజన్ బాలమురళీ మోహన్ ఇంటికి వెళ్లి ఆయన గది తలుపులు బద్దలు కొట్టి చూడగా బాల మురళీ మోహన్ ఫ్యాన్కు ఉరి వేసుకుని శవంగా వేలాడుతూ కనిపించాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. బాల మురళీ మోహన్కు భార్య సీతారాణి, ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.