పీపీపీ విధానంలో పోర్టుల అభివృద్ధి | Six minor ports in the state to be developed under PPP model | Sakshi
Sakshi News home page

పీపీపీ విధానంలో పోర్టుల అభివృద్ధి

Nov 18 2014 2:53 AM | Updated on Sep 2 2017 4:38 PM

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామం (పీపీపీ) పద్దతిన రాష్ట్రంలో ఆరు పోర్టులను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర పోర్టులు, జౌళీశాఖ మంత్రి బాబురావ్ చించన్‌సూర్ వెల్లడించారు.

మంత్రి బాబురావ్‌చించన్‌సూర్
సాక్షి, బెంగళూరు :  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామం (పీపీపీ) పద్దతిన రాష్ట్రంలో ఆరు పోర్టులను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర పోర్టులు, జౌళీశాఖ మంత్రి బాబురావ్ చించన్‌సూర్ వెల్లడించారు. బెంగళూరులో మీడియాతో ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 12 పోర్టులు ఉండగా అందులో బెలికెరే, తదడితో సహా ఆరు పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేల కోట్ల రుపాయాల నిధులు కావాల్సి ఉంటుందన్నారు. ఇంత మొత్తాన్ని ప్రభుత్వం ఒక్కటే భరించడానికి వీలు కాదన్నారు. అందువల్ల ప్రైవేటు కంపెనీల సహకారం వీటిని అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. 30 ఏళ్ల లీజు ప్రతిపాదికన పోర్టుల అభివృద్ధి, నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టనున్నామని తెలిపారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి బాబురావ్ తెలిపారు. మంగళూరు పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అందువల్ల దీన్ని ప్రైవేటు సంస్థలకుకాని, వ్యక్తులకుగాని లీజుకు ఇవ్వడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. నూతన పాలసీ ప్రకారం జిల్లాకొక  జౌళిపార్కును ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement