ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. అయితే భారత్ నౌకలు మాత్రం జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ ఎల్పీజీ ట్యాంకర్ జలసంధి గుండా భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా భారత్ ధన్యవాదాలు తెలుపగా ఇరాన్ దానికి స్పందించింది.
చమురు నౌక గుజరాత్ చేరుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ ట్యాంకర్ ప్రయాణాన్ని భారతీయ దౌత్య విజయంగా అభివర్ణించారు. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. "భారతదేశం, ముఖ్యంగా గుజరాత్, మా ఉమ్మడి చరిత్రలో ఒక మధురమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. శతాబ్దాల క్రితం మా దేశం నుండి వచ్చిన వారిని మీరు సాదరంగా ఆహ్వానించారు. ఈ నాగరికత సంబంధాల ఆధారంగా, మన మధ్య స్నేహం మరియు సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము." అని తెలిపింది.
కాగా ఇరాన్ కాన్సులేట్ తన సందేశంలో సింధూ నాగరికతకు చెందిన లోథల్ ఓడరేవును ఉద్దేశించి మాట్లాడింది. సుమారు 4,000 ఏళ్ల క్రితమే సింధు లోయ నాగరికతకు మరియు పర్షియా తీరానికి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ఇది గుర్తుచేస్తుంది. కాగా గ్రీన్ సాన్వీ అనే నౌక 46,650 మెట్రిక్ టన్నుల గ్యాస్తో హర్ముాజ్ జలసంధిని దాటింది.
అయితే హర్మూజ్ జలసంధి విషయమై ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దానిని ఎట్టిపరిస్థితుల్లో తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేస్తుండగా ఇరాన్ ససేమిరా అంటుంది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ కేవలం 5 మిత్ర దేశాలకు భారతదేశం,రష్యా, చైనా, ఇరాక్,పాకిస్థాన్ అనుమతినిచ్చింది.


