తేలుతో సరదా | Sakshi
Sakshi News home page

తేలుతో సరదా

Published Tue, Aug 6 2019 8:22 AM

Scorpion Festival in Karnataka - Sakshi

మామూలుగా ఎవరైనా తేలు కనిపిస్తే భయంతో వణికిపోతారు. దొరికిన వస్తువుతో దానిని కొట్టి చంపుతారు. పొరపాటున తేలు కుట్టిందా ఆ నొప్పిని భరించడం ఎవరి తరం కాదు. ఎన్ని మందులు, మాత్రలు వేసుకున్నా ఒకరోజంతా నొప్పే. కానీ అలాంటి తేలును కూడా ఒకరోజు పూజిస్తారు.  

కర్ణాటక ,రాయచూరు రూరల్‌:  దేశవ్యాప్తంగా నాగపంచమి రోజున నాగదేవతకు పూజలు నిర్వహిస్తే యాదగిరి తాలూకాలోని కందకూరు గ్రామంలో కొండమాయి తేలు దేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తేళ్లకు పుట్టినిల్లుగా పేరొందిన గ్రామంలో కొండమీద ఉన్న కొండమాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిæస్తారు. పంచమి రోజున కొండపై అనేక జాతులకు చెందిన తేళ్లు ఎక్కడపడితే అక్కడ దర్శనంమిస్తాయి. ఎర్ర తేలు, ఇనుప తేలు వంటి విషపూరితమైన తేళ్లు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. గ్రామ ప్రజలు కుల, మత భేదాలు లేకుండా దేవస్థానంలో పూజలను నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు, పిల్లలు ఈ తేళ్లను ఏమాత్రం భయం లేకుండా పట్టుకునేందుకు పోటీ పడుతుంటారు. పాములు కనిపిస్తే వాటిని సైతం మెడలో వేసుకుని ఆడుకుంటుంటారు. 

హాని తలపెట్టవట  
ఈ రోజున ఏ విష జంతువు అయినా హాని తలపెట్టదని, అవి కాటు వేసినా కొండమాయి దేవి విభూతిని పెట్టుకుంటే చాలు నయం అవుతుందనేది ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ విషయంపై గ్రామ ప్రజలను విచారించగా పంచమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం« ద్వారా ఇక్కడి ప్రజలకు ఏ విష జంతువూ హాని చేయదన్నారు. ఈ పండుగను వందలాది సంవత్సరాల నుంచి ఆచరిçస్తూ వస్తున్నారు. భక్తులు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంతో పాటు చుట్టు పక్కల అనేక కొండలు ఉన్నా కొండమాయి దేవి కొండపై మాత్రం ఏ రాతిని కదిలించినా తేళ్లు దర్శనం ఇవ్వడం విశేషం. 

Advertisement
Advertisement