మెట్రో భూగర్భమార్గంపై దక్షిణ ఢిల్లీవాసుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్గంలో రైళ్ల రాకపోకల కారణంగా తమ భవనాల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ దక్షిణ ఢిల్లీవాసులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టును ఆశ్రయించిన దక్షిణ ఢిల్లీవాసులు
న్యూఢిల్లీ: మెట్రో భూగర్భమార్గంపై దక్షిణ ఢిల్లీవాసుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్గంలో రైళ్ల రాకపోకల కారణంగా తమ భవనాల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ దక్షిణ ఢిల్లీవాసులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. సాకేత్లోని డీ బ్లాక్కు చెందిన కొందరు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. యెల్లో లైన్లో జహంగీర్పురి నుంచి గుర్గావ్లోని హుడా కాంప్లెక్స్కు రాకపోకలు సాగిస్తున్న రైళ్లు చేస్తున్న శబ్దంతో తమకు మనశ్శాంతి కరువైందని, వాటి వేగానికి భవనాలు కంపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కారణంగా తమ భవనాలకు ఎక్కడ ముప్పు సంభవిస్తుందోనని అనుక్షణం భయపడుతున్నామన్నారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, భద్రత విషయమై నిపుణుల అభిప్రాయాలను కోరాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కేంద్రం నుంచి వివరణ కోరింది. అంతేకాకుండా డీఎంఆర్సీకి కూడా నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల వాదనపై జూలై 7లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పిటిషనర్ల ఆందోళనకు కారణమవుతున్న ప్రకంపనలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తెలుసుకోవాలని, అవి పరిమితిని దాటుతున్నాయా? అనే విషయంలో పరిశీలనలు జరిపి, ఆ వివరాలను జూలై 7లోగా రిజిస్ట్రార్కు సమర్పించాలని ఆదేశించింది. ప్రాథమిక ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కేసు కోర్టు ముందుకు వస్తుందని, అప్పటిదాకా ఈ విషయమై దాఖలైన పిటిషన్లను రిజిస్ట్రార్కు సమర్పించాలని సూచించింది.
ఇదిలాఉండగా నగరంలో మూడోదశ మెట్రో పనులు కూడా వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫేజ్లో భాగంగా చేపడుతున్న మార్గం దాదాపుగా భూగర్భ మార్గమే. దాదాపు 50 కిలోమీటర్లకు పైగా భూగర్భ మార్గంలోనే మూడో ఫేజ్లోని స్టేషన్లు నిర్మి స్తున్నారు. ఈ పనులపై కోర్టు తీర్పు ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.