ర్యాపిడ్ మెట్రోకు ఆదరణ అంతంతే.. | In just nine days, 1 lakh people take Rapid Metro | Sakshi
Sakshi News home page

ర్యాపిడ్ మెట్రోకు ఆదరణ అంతంతే..

Nov 23 2013 11:25 PM | Updated on Sep 27 2018 2:34 PM

ర్యాపిడ్ మెట్రో గుర్గావ్ లిమిటెడ్ ఈ నెల 14 నుంచి ప్రారంభించిన ర్యాపిడ్‌మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య వారంలో లక్షకు మించలేదు. అయితే ఉద్యోగులకు బస్‌పాసుల గడువు మాసాంతంతో ముగుస్తుంది

అధికారులు మాత్రం ఇది మంచి స్పందనేనని, భవిష్యత్‌లో ఫలితాలు మరింత బాగుంటాయని చెబుతున్నారు. ‘ప్రజల స్పందన బాగుంది.వినియోగదారులకు మా కృతజ్ఞతలు. భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లు అధిగమించడానికి మేం ప్రయత్నిస్తాం’ అని ర్యాపిడ్ మెట్రో సీఈవో సంజీవ్ రాయ్ అన్నారు. 
 
డీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ర్యాపిడ్‌మెట్రోరైలు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీవాసులు ఎక్కువలో ఎక్కువ మంది మోనోరైలు వినియోగిస్తారని అధికారులు మొదట భావించారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు శాతం అధికంగా ప్రయాణికుల సంఖ్య నమోదవుతున్నట్టు అధికారిక సమాచారం.ఉదయం 8-30 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 5 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ప్రయాణికుల రద్దీ ఉంటోంది. సికిందర్‌పురా స్టేషన్‌ను ఇంటర్‌చేంజ్ స్టేషన్‌గా వినియోగిస్తుండడంతో ఇక్కడ రద్దీ అధికంగా కనిపిస్తోంది. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వేకు సమీపంలోనిర్మిస్తున్న గేట్‌వే టవర్ స్టేషన్ పూర్తయితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
 
 ర్యాపిడ్ మెట్రో ప్రయాణికుల్లో ఎక్కువగా ఉద్యోగులే ఉంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పనిచేసేవారంతా ఈ రైలును వినియోగిస్తున్నారు. దీంతో వారాంతాలు, సెలవుల్లో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. ఇంటర్‌చేంజ్ స్టేషన్ అయిన సికిందర్‌పురా స్టేషన్‌లో పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి మరో కారణమవుతోంది. సెక్టార్-17 వరకు ర్యాపిడ్ మెట్రోను విస్తరిస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతందని స్థానిక ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతినిత్యం లక్ష మందికి సేవలు అందించాలని ర్యాపిడ్‌మెట్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. 
 
 ‘ఈ సేవలను నెల మధ్యలో ప్రారంభించడం వల్ల ఇతర రవాణా సంస్థల్లో నెలవారీ పాసులు కొన్న ఉద్యోగులు ఇంకా ర్యాపిడ్ మెట్రో వినియోగించడం లేదు. డిసెంబర్ ఒకటి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం’ అని ర్యాపిడ్‌మెట్రో అధికార ప్రతినిధి తెలిపారు. నగరప్రజలు ముఖ్యంగా సైబర్‌సిటీ ఉద్యోగుల్లో ర్యాపిడ్ మెట్రోపై అవగాహన పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. హర్యానా రోడ్డు రవాణాసంస్థ ఫీడర్ బస్సు సేవలను కూడా ప్రవేశపెట్టినందువల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. మౌల్సారీ ఎవెన్యూ మెట్రోస్టేషన్ నుంచి తమ దుకాణం వరకు ఏంబియెన్స్ మాల్ కూడా షటిల్ బస్సు ప్రారంభించిందని ర్యాపిడ్‌మెట్రో అధికార ప్రతినిధి వివరించారు. ర్యాపిడ్‌మెట్రో గుర్గావ్ లిమిటెడ్ ఈ నెల 11 నుంచి ఈ సేవలను ప్రారంభించింది. సికందర్‌పూర్ నుంచి ఫేజ్ 3 స్టేషన్ వరకు నిర్మించిన ఈ 5.1 కిలోమీటర్ల మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉంటాయి. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement