కిక్కిరిసిన ఢిల్లీ | Crowded in Delhi | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన ఢిల్లీ

Sep 30 2013 2:52 AM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీ ప్రభం‘జనం’ ముందు వరుణుడు తప్పుకున్నాడు. వికాస్‌ర్యాలీలో పాల్గొనేందుకు ఆపార్టీ కార్యకర్తలు, మోడీ అభిమానులు ఉదయం ఆరు గంటల నుంచే వరుసకట్టారు. సమయం గడుస్తున్నకొద్దీ జపనీస్‌పార్క్‌కి దారితీసే మార్గాల్లో వాహనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

సాక్షి, న్యూఢిల్లీ: మోడీ ప్రభం‘జనం’ ముందు వరుణుడు తప్పుకున్నాడు. వికాస్‌ర్యాలీలో పాల్గొనేందుకు ఆపార్టీ కార్యకర్తలు, మోడీ అభిమానులు ఉదయం ఆరు గంటల నుంచే వరుసకట్టారు. సమయం గడుస్తున్నకొద్దీ జపనీస్‌పార్క్‌కి దారితీసే మార్గాల్లో వాహనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ మందకొడిగా కదిలింది. దీంతో కొన్నిచోట్ల రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఏ రోడ్డులో చూసిన  బీజేపీ జెండాలు, నరేంద్ర మోడీ ఫొటోలు అంటించి ఉన్న కార్లు, బస్సులే కనిపించాయి. సభ ప్రారంభమైన గంట వరకు కొంతమంది వేదిక వద్దకు చేరుకోలేకపోయా రు. ముఖ్యంగా కార్లు సొంత వాహనాల్లో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో వాహనదారులు అవస్తలు పడాల్సి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసికూడా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
 
 వికాస్ ర్యాలీకి వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకుల విజ్ఞప్తి మేరకు డీఎంఆర్‌సీ అదనంగా మెట్రోరైళ్లను నడిపింది. రెడ్‌లైన్‌లోని మెట్రోరైళ్లలో రద్దీ అంతకంతకు పెరిగింది. దాదాపు 50 వేల మంది వరకు మెట్రోరైళ్లను వినియోగించుకుని ర్యాలీకి హాజరయ్యారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఒకేసారి తిరుగుప్రయాణపు టికెట్లు కూడా ఇచ్చారు. 
 
 అదే విధంగా ఒక్కరి ఒక్క టోకెన్ కాకుండా మొత్తం బృందానికి కలిపి ఒకటే టోకెన్ ఇవ్వడంతో ప్రయాణికులకు కాస్త ఊరట కలిగింది. రిటాలా మెట్రోస్టేషన్ నుంచి సభా ప్రాంగణానికి వె ళ్లేందుకు అందుబాటులో ఉంచిన ఫీడర్‌బస్సులు సైతం కిక్కిరిసిపోయాయి. సభ పూర్తయిన తర్వాత ఒకేమారు అంతా తిరుగు ప్రయాణం కావడంతో మెట్రో స్టేషన్ పరిసరాలు రద్దీగా కనిపించాయి. రెడ్‌లైన్‌లో మొత్తం 26 మెట్రోరైళ్లను అదనంగా నడిపినట్టు డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement