జాలర్లకు విముక్తి | 51 repatriated fishermen reach Karaikal | Sakshi
Sakshi News home page

జాలర్లకు విముక్తి

Jan 18 2014 6:12 AM | Updated on Sep 2 2017 2:45 AM

శ్రీలంక చెరలో మగ్గుతున్న 52 మంది తమిళ జాలర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది.

 చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక చెరలో మగ్గుతున్న 52 మంది తమిళ జాల ర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలి తంగా 51 మంది జాలర్లు గురువారం రాత్రి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. మరో జాలరి గుండెపోటుకు గురై శ్రీలంక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సముద్రంలో సరిహద్దు సమస్యను సాకుగా చేసుకుని శ్రీలంక నావికా దళం తరచూ తమిళ జాలర్లపై దాడులకు దిగుతోంది. అలాగే వారిని అరెస్టు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే శ్రీలంక ప్రభుత్వం కంటితుడుపుగా కొందరిని విడిచిపెడుతోంది. రెండు దేశాల జాలర్ల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు జాలర్ల సంఘాల ప్రతినిధులతో కేంద్రం ఈ నెల 20వ తేదీన చెన్నైలో చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చర్చలు సామరస్యంగా సాగాలన్న తలంపుతో శ్రీలంక ప్రభుత్వం తమ చెరలో ఉన్న జాలర్లను అక్కడి కోర్టులో ప్రవేశపెట్టింది. వారిని విడుదల చేసేందుకు అంగీకరించింది. తమ మరబోట్లను అప్పగించాలని తమిళ జాలర్లు డిమాండ్‌ను శ్రీలంక తోచిపుచ్చింది. వాటిని ఇచ్చేది లేదని ఖరాకండిగా చెప్పింది.
 
 తమకు జీవనాధారమైన మరబోట్లను అప్పగిస్తేగాని నౌక ఎక్కబోమని జాలర్లు భీష్మించారు. శ్రీలంక దళాల వైఖరితో దిగాలు పడిన కారైక్కాల్ జిల్లా పట్టినచ్చేరికి చెందిన మరబోట్ల యజమాని పొన్నుస్వామి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతన్ని శ్రీలంకలోని ఆస్పత్రిలో చేర్పించారు. పొన్నుస్వామి కోలుకున్న తర్వాత విమానంలో పంపుతామని శ్రీలంక దళాలు పేర్కొన్నారుు. మిగిలిన 51 మంది జాలర్లను బలవంతంగా నౌకలోకి ఎక్కించాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు శ్రీలంకలోని కొడియ సముద్రతీరం నుంచి బయలుదేరిన నౌక 16 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి జాతీయ ఉమ్మడి సరిహద్దుకు చేరుకుంది. భారత్ ఇటీవలే సేవల్లోకి తెచ్చిన విశ్వాస్ట్ గస్తీ నౌక ద్వారా గురువారం రాత్రి జాలర్లు కారైక్కాల్ చేరుకున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయపాల్, నాగపట్నం జిల్లా కలెక్టర్ మునుస్వామి వారికి స్వాగతం పలికారు. తమవారి రాకకోసం ఎదురుచూస్తున్న జాలర్ల కుటుంబాల వారు ఉద్వేగానికి గురై ఆనంద భాష్పాలు రాల్చారు. శ్రీలంక చెరలో ఉన్న మిగిలిన మత్స్యకారులు దశలవారీగా విడుదలవుతారని ఈ సందర్భంగా మంత్రి మీడియాకు తెలిపారు. జాలర్ల సంఘాల ప్రతినిధులతో ఈ నెల 20వ తేదీన జరగనున్న చర్చల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
 
 మరబోట్లతోనే మా బతుకు
 శ్రీలంక ప్రభుత్వం తమను విడిచిపెట్టి మరబోట్లను అప్పగించకపోవడం దారుణమని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక చెరలో తాము పడిన కష్టాలు వర్ణనాతీతమని వాపోయారు. తమను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మరబోట్లను సైతం అప్పగించాలని న్యాయమూర్తులు ఆదేశించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం శ్రీలంక ప్రభుత్వం ధిక్కరించి అన్యాయం చేసిందనిఆరోపించారు. మరబోట్లు దక్కవనే బెంగతోనే వాటి యజమాని పొన్నుస్వామి గుండెపోటుకు గురయ్యూడని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మరబోట్లు విడిపించాలని, లేదా నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement