
మరోసారి మెరిసిన యువీ
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో పంజాబ్ కెప్టెన్ యువరాజ్ సింగ్ మరోసారి మెరిశాడు.
హైదరాబాద్: ఈ సీజన్ రంజీ ట్రోఫీలో పంజాబ్ కెప్టెన్ యువరాజ్ సింగ్ మరోసారి మెరిశాడు. గ్రూప్-ఎలో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉత్తర్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో యువరాజ్ సింగ్ (85;130 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అతనికి జతగా మన్ దీప్ సింగ్(63;118 బంతుల్లో 8 ఫోర్లు,1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులు చేసింది. 243/3 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ మరో 76 పరుగులు మాత్రమే చేసి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది.
ఓవర్ నైట్ ఆటగాడు యువరాజ్ సింగ్ నాల్గో వికెట్ గా అవుటైన తరువాత మన్ దీప్ సింగ్ ఒక్కడే రాణించాడు. ఆపై మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించే అవకాశం కోల్పోయింది. ఉతర్ ప్రదేశ్ బౌలర్లలో సౌరవ్ కుమార్ కు నాలుగు వికెట్లు లభించగా, అంకిత్ రాజ్ పుత్,ఇంతియాజ్ అహ్మద్లకు తలో మూడు వికెట్లు లభించాయి. ఉత్తర్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 335 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.