నేటినుంచి ఆసియా బ్యాడ్మింటన్ | Today from Asian Badminton Team Championship | Sakshi
Sakshi News home page

నేటినుంచి ఆసియా బ్యాడ్మింటన్

Feb 16 2016 12:37 AM | Updated on Sep 3 2017 5:39 PM

ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది.

* బరిలో 14 దేశాల జట్లు   
* టోర్నీకి సైనా నెహ్వాల్ దూరం

సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు (సోమవారం) ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఈ నెల 21 వరకు జరుగుతుంది. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 14 దేశాలకు చెందిన 26 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఒక్కో విభాగంలో మూడేసి జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ పోటీల అనంతరం రెండు జట్లు ముందుకు వెళతాయి.

ఆ తర్వాత క్వార్టర్స్‌నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. థామస్, ఉబెర్ కప్ తరహాలోనే ఇరు జట్ల మధ్య జరిగే పోరులో మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లు ఉంటాయి. పురుషుల విభాగంలో ‘ఎ’ గ్రూప్‌లో భారత్‌తో పాటు చైనా, సింగపూర్ ఉండగా...మహిళల విభాగం గ్రూప్ ‘డి’లో భారత్, జపాన్, సింగపూర్ ఉన్నాయి.

తొలి రెండు రోజుల పాటు భారత మ్యాచ్‌లు లేవు. బుధ, గురువారాల్లో మన జట్టు ప్రత్యర్థులతో తలపడుతుంది. ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో పాటు కశ్యప్ కూడా గాయం కారణంగా ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదు. శ్రీకాంత్, అజయ్ జైరాం, ప్రణయ్, సింధు, జ్వాల, అశ్వినిల ప్రదర్శనపై భారత జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement