
హైదరాబాద్ బ్యాటింగ్
ఐపీఎల్- 8లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజృంభిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ధావన్ వీరబాదుడుతో పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.
హైదరాబాద్ : ఐపీఎల్- 8 లో భాగంగా సోమవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కింగ్ర్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో హోం టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ విజృంభిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ధావన్ వీరబాదుడుతో పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఏడో విజయం సాధించి ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలని హైదరాబాద్ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాట్ ఝుళిపించడం అన్ని మ్యాచ్ ల్లోనూ కీలకంగా మారింది. ఇయాన్ మోర్గాన్ ఫాంలోకి రావడం శుభపరిణామం. గత రెండు మ్యాచ్ ల్లో హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి ముందు స్వల్పలక్ష్యమే ఉంచినప్పటికీ భువనేశ్వర్, ఇషాంత్, ప్రవీణ్ల పేస్కు తోడు హెన్రిక్స్, బొపారా మీడియం పేస్ సహకారంతో విజయతీరాలకు చేరింది.
పసలేని పంజాబ్...
కేవలం 2 విజయాలు... ఆడిన 11 మ్యాచ్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దుస్థితి ఇది. గతేడాది ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించి ఫైనల్ చేరిన బెయిలీ సేన ఈసారి బేలగా మారిపోయింది. మొహాలీలో జరిగిన మ్యాచ్లో సన్కు తలవంచిన ఆ జట్టు పరిస్థితిలో ఈ రెండు వారాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. విజయ్, వోహ్రా, సాహా, మిల్లర్, బెయిలీల బ్యాటింగ్ బలం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వరుసగా విఫలమైన మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడం మాత్రం వారికి కాస్త ఊరటనిచ్చింది. మొత్తంగా బలాబలాలు చూస్తే పరిస్థితి అంతా సన్రైజర్స్కు అనుకూలంగానే కనిపిస్తోంది. పంజాబ్ గెలిస్తే అది సంచలనమే కావచ్చు.