
ఉఫ్... హమ్మయ్య!
సొంతగడ్డపై చివరి మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే హైదరాబాద్ ప్లేఆఫ్కు వెళుతుంది.
అలవోకగా గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ ఉత్కంఠను ఎదుర్కొంది. డేవిడ్ మిల్లర్ సిక్సర్ల సునామీకి కొట్టుకుపోతుందేమో అని భయపడాల్సి వచ్చింది. చివరి ఓవర్లో విజయానికి 28 పరుగులు అవసరం కాగా... ఇషాంత్ వేసిన ఈ ఓవర్లో మిల్లర్ ఏకంగా 22 పరుగులు బాది కంగారుపెట్టాడు. మొత్తానికి పంజాబ్పై గెలిచిన సన్రైజర్స్ ఊపిరిపీల్చుకుని ప్లేఆఫ్కు చేరువయింది.
సన్రైజర్స్ హ్యాట్రిక్ విజయం
⇒ చెలరేగిన వార్నర్
⇒ మిల్లర్ పోరాటం వృథా
⇒ పంజాబ్ ఖాతాలో మరో ఓటమి
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై చివరి మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే హైదరాబాద్ ప్లేఆఫ్కు వెళుతుంది. చివరి రెండు మ్యాచ్ల్లో బెంగళూరు, ముంబైలతో ఆడాలి. ఆ రెండు జట్లూ భీకరంగా ఆడుతున్నాయి. కాబట్టి ఫామ్లో లేని పంజాబ్పై కచ్చితంగా గెలిస్తే... తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఒకటి ఓడినా ఇబ్బంది ఉండదు. ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ బ్యాట్స్మెన్ మరోసారి చెలరేగారు. కెప్టెన్ వార్నర్ ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి హైదరాబాద్ను నిలబెట్టాడు. మిల్లర్ పోరాటంలో పంజాబ్ ఆతిథ్య జట్టుకు చెమటలు పట్టించినా... చివరకు సన్రైజర్స్ గట్టెక్కింది.
ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రైజర్స్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మళ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (44 బంతుల్లో 89 నాటౌట్; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) అద్భుతంగా చెలరేగి ఆడినా మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో హెన్రిక్స్ 3, బిపుల్ 2 వికెట్లు పడగొట్టారు. వార్నర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మెరుపు ఆరంభం
టాస్ గెలిచిన సన్రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచినా...జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగడం విశేషం. బొపారా, ప్రవీణ్, రసూల్ స్థానంలో బౌల్ట్, రాహుల్, బిపుల్ జట్టులోకి వచ్చారు. వార్నర్, ధావన్ (18 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ జోరుగా సాగింది. రెండో ఓవర్లో 1 సిక్స్, 2 ఫోర్లతో వార్నర్ 14 పరుగులు రాబట్టాడు. హెన్డ్రిక్స్ వేసిన ఓవర్లో బ్యాట్స్మెన్ 2 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. ఫలితంగా సన్ పవర్ప్లేలో 56 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే మ్యాక్స్వెల్ చక్కటి బంతితో ఈ జోడీని విడదీశాడు.
ఈ దశలో వార్నర్తో జత కలిసిన హెన్రిక్స్ (24 బంతుల్లో 28; 4 ఫోర్లు) కూడా వేగంగా ఆడాడు. మరో వైపు దూకుడు తగ్గించని వార్నర్, పటేల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి 36 బంతుల్లోనే ఈ సీజన్లో ఆరో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్కు 45 బంతుల్లోనే 65 పరుగులు జోడించిన అనంతరం హెన్రిక్స్ వెనుదిరిగాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ ఓవర్లో వరుస బంతుల్లో 6,6,4 బాదిన మోర్గాన్ (7 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సర్లు) తర్వాతి ఓవర్లో అవుటయ్యాడు. ఐపీఎల్-8లో 500 పరుగులు పూర్తి చేసుకున్న వార్నర్ మిడ్ వికెట్లో సునాయాస క్యాచ్ ఇచ్చి అవుటవగా, తర్వాతి బంతికి ఓజా (2) రనౌటయ్యాడు. చివర్లో రాహుల్ (17 నాటౌట్), కరణ్ (11 నాటౌట్) 16 బంతుల్లోనే 28 పరుగులు జత చేశారు. తొలి 10 ఓవర్లలో 86 పరుగులు చేసిన రైజర్స్ తర్వాతి 10 ఓవర్లలో 99 పరుగులు చేసింది.
టపటపా వికెట్లు
భారీ లక్ష్యఛేదనలో ఇన్నింగ్స్ను ధాటిగానే ఆరంభించిన పంజాబ్ ఆ తర్వాత చతికిల పడింది. బౌల్ట్ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 15 పరుగులు రాబట్టిన విజయ్ (18 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరులో అవుటయ్యాడు. పవర్ప్లేలో 47 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్ తర్వాతి ఓవర్ తొలి బంతికే వోహ్రా (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. అనంతరం ఏ దశలోనూ కోలుకోలేకపోయిన జట్టు సీజన్లో తమ చెత్త ఫామ్ను ఈ మ్యాచ్లోనూ కొనసాగించింది. నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్వెల్ (11) ప్రభావం చూపలేకపోగా, సాహా (5), బెయిలీ (6) కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. చివర్లో మెరుపు బ్యాటింగ్తో 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మిల్లర్ సిక్సర్లతో విరుచుకు పడి తుదికంటా పోరాడాడు.
స్కోరు వివరాలు:-
సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) గురుకీరత్ (బి) హెన్డ్రిక్స్ 81; ధావన్ (స్టంప్డ్) సాహా (బి) మ్యాక్స్వెల్ 24; హెన్రిక్స్ (సి) అనురీత్ (బి) గురుకీరత్ 28; మోర్గాన్ (సి) వోహ్రా (బి) హెన్డ్రిక్స్ 17; నమన్ ఓజా (రనౌట్) 2; రాహుల్ (నాటౌట్) 17; కరణ్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185
వికెట్ల పతనం: 1-56; 2-121; 3-140; 4-157; 5-157.
బౌలింగ్: సందీప్ 4-0-33-0; అనురీత్ 4-0-37-0; హెన్డ్రిక్స్ 4-0-40-2; గురుకీరత్ 3-0-27-1; మ్యాక్స్వెల్ 3-0-28-1; పటేల్ 2-0-19-0.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ధావన్ (బి) బిపుల్ 24; వోహ్రా (సి) భువనేశ్వర్ (బి) బిపుల్ 20; సాహా (సి) రాహుల్ (బి) హెన్రిక్స్ 5; మ్యాక్స్వెల్ (సి) నమన్ (బి) బౌల్ట్ 11; మిల్లర్ (నాటౌట్) 89; బెయిలీ (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 6; గురుకీరత్ (సి) మోర్గాన్ (బి) హెన్రిక్స్ 3; పటేల్ (సి) నమన్ (బి) భువనేశ్వర్ 15; హెన్డ్రిక్స్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 180.
వికెట్ల పతనం: 1-42; 2-47; 3-60; 4-65; 5-81; 6-99; 7-158.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-34-1; బౌల్ట్ 4-0-45-1; ఇషాంత్ 4-0-49-0; బిపుల్ 2-0-13-2; హెన్రిక్స్ 4-0-16-3; కరణ్ 2-0-20-0.