హరికృష్ణకు ఐదో స్థానం | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు ఐదో స్థానం

Published Mon, Apr 3 2017 1:45 AM

Shenzhen Masters chess: Pentala Harikrishna in fifth place

న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో చైనాలో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. హరికృష్ణ 4.5 పాయింట్లతో యు యాంగి (చైనా)తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా యు యాంగికి నాలుగో స్థానం, హరికృష్ణకు ఐదో స్థానం లభించాయి. చివరిదైన పదో రౌండ్‌లో హరికృష్ణ 53 ఎత్తుల్లో లిరెన్‌ డింగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 6.5 పాయింట్లతో లిరెన్‌ డింగ్‌ విజేతగా నిలువగా... అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌–5.5) రెండో స్థానంలో, స్విద్లెర్‌ (రష్యా–5.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.

Advertisement
Advertisement