సాకేత్ జోడికి డబుల్స్ టైటిల్ | Saketh Maineni team doubles title | Sakshi
Sakshi News home page

సాకేత్ జోడికి డబుల్స్ టైటిల్

Mar 8 2014 1:31 AM | Updated on Sep 2 2017 4:27 AM

సాకేత్ జోడికి డబుల్స్ టైటిల్

సాకేత్ జోడికి డబుల్స్ టైటిల్

టాప్ సీడింగ్ హోదాకు న్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్ (భారత్)తో కలిసి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఐటీఎఫ్ టోర్నమెంట్
 భీమవరం, న్యూస్‌లైన్: టాప్ సీడింగ్ హోదాకు న్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్ (భారత్)తో కలిసి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్‌లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 7-6 (7/5), 6-3తో రెండో సీడ్ శ్రీరామ్ బాలాజీ-రంజిత్ విరాళీ మురుగేశన్ (భారత్) జోడిని ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.
 
 తొలి సెట్ టైబ్రేక్‌లో 3-5తో వెనుకబడిన దశలో సాకేత్ జంట వరుసగా ఐదు పాయింట్లు నెగ్గింది. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్‌లో ఇది 12వ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ కాగా సనమ్ సింగ్‌తో కలిసి నాలుగో టైటిల్ కావడం విశేషం. కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన సాకేత్, సనమ్ సింగ్ సింగిల్స్ విభాగం అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. సెమీఫైనల్స్‌లో సాకేత్ 6-3, 6-1తో శ్రీరామ్ బాలాజీపై నెగ్గగా... సనమ్ సింగ్ 6-3, 6-3తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ విష్ణువర్ధన్‌ను ఓడించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement