క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌

Sai Praneeth Kashyap enter quarterfinals - Sakshi

సింధు, శ్రీకాంత్‌ కూడా

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్‌.ఎస్‌. ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్‌ రెడ్డి, ప్రణవ్‌ చోప్రా–శివమ్‌ శర్మ జోడీలు, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప, అపర్ణా బాలన్‌–శ్రుతి జంటలు కూడా క్వార్టర్స్‌ చేరాయి. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భమిడిపాటి సాయిప్రణీత్‌ 18–21, 21–16, 21–15తో భారత్‌కే చెందిన ఐదో సీడ్‌ సమీర్‌వర్మకు షాకిచ్చాడు. మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 21–11, 21–16తో లూ గ్వాంగ్‌జు (చైనా)పై గెలుపొందగా, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 21–19, 20–22, 21–17తో జాన్‌ జార్జెన్సన్‌ (డెన్మార్క్‌)ను ఓడించాడు.

పారుపల్లి కశ్యప్‌ 21–11, 21–13తో తనోంగ్సక్‌ సెన్సోబూన్సుక్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, రెండో సీడ్‌ సింధు 21–11, 21–13తో డెంగ్‌ జాయ్‌ జువన్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో ఆరో సీడ్‌ మను అత్రి–సుమీత్‌ రెడ్డి ద్వయం 25–23, 21–18తో హువంగ్‌ కిజియంగ్‌–వాంగ్‌ జెకంగ్‌ (చైనా) జంటపై, ప్రణవ్‌–శివమ్‌ జోడీ 21–15, 21–11తో భారత్‌కే చెందిన అనిరుధ మయేకర్‌–వినయ్‌ జంటపై గెలుపొందాయి. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి –అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–14తో చెన్‌జియాఫో–జౌ చొమిన్‌ (చైనా) జోడీపై, అపర్ణ–శ్రుతి జంట 21–19, 7–21, 21–17తో వింగ్‌ యంగ్‌–యియంగ్‌ టింగ్‌ (హాంకాంగ్‌) జోడీపై గెలిచాయి. నేటి పురుషుల క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్‌ ఢీకొంటాడు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top