'మెల్ బోర్న్'లో రోహిత్ రికార్డులు
మెల్బోర్న్: మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ తొలిస్థానం కైవసం చేసుకున్నారు. అంతకుముందు ఇక్కడ భారత మాజీ ఆటగాళ్లు శ్రీకాంత్, అగార్కర్ 2 సిక్సర్లు బాదారు. ఆ రికార్డును రోహిత్ బద్దలు చేశాడు. తాజాగా తన వ్యక్తిగత స్కోరు 49 పరుగుల వద్ద రోహిత్ ఫాల్కనర్ బౌలింగ్లో సిక్సర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఆ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక్కడ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ రికార్డులోకెక్కాడు. 2000 లో ఆస్ట్రేలియాపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన 100 పరుగులే అత్యధికం. తాజాగా రోహిత్ 138 పరుగులు చేసి ఈ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇతర దేశ ఆటగాళ్లు చూసినట్లయితే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ స్టేడియంలో 119 పరుగులు చేశాడు. ఆ రికార్డు కూడా రోహిత్ తుడిచి పెట్టాడు. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నీల్లో రెండు డబుల్ సెంచరీలు చేసి రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. భవిష్యత్లో ఈ యువ ఆటగాడు మరెన్ని రికార్డులు బద్దలు చేస్తాడో చూడాలి.