‘అప్పుడే నేను మెరుగ్గా ఆడగలను’ | Pressure Brings The Best Out Of Me, Says KKR's Nitish Rana | Sakshi
Sakshi News home page

‘అప్పుడే నేను మెరుగ్గా ఆడగలను’

Apr 17 2018 6:37 PM | Updated on Apr 17 2018 9:04 PM

Pressure Brings The Best Out Of Me, Says KKR's Nitish Rana - Sakshi

కోల్‌కతా: ఒత్తిడి సమయంలో ఆడటం అంటే తనకు చాలా ఇష్టమని అంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు నితీష్‌ రానా. అలా ఒత్తిడి సమయంలో ఆడినప్పుడే తనలోని మెరుగైన క్రీడాకారుడు బయటకు వస్తాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణా 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 71 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 మ్యాచ్‌ తర్వాత మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న సమయంలో  రానా మాట్లాడుతూ.. ‘ఒత్తిడిలో నేను మరింత మెరుగ్గా ఆడగలనని గతంలో చెప్పాను.  ఒత్తిడిని జయిస్తూ ఆడటాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేస్తా. ఒత్తిడిలో ఆడేటప్పుడు నాలోని మెరుగైన క్రికెటర్‌ బయటకొస్తాడు. 10 ఓవర్లకే మా జట్టు 3 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌ మాకెంతో కీలకం. గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడిపోయాం. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలనుకున్నాం. అందుకే జట్టులో అందరూ సమష్టిగా రాణించారు. కుల్దీప్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, మ్యాక్స్‌వెల్‌ కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. చివరి వరకూ పోరాడాలన్నది నా గేమ్‌ ప్లాన్‌. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో నేను మొదటి మ్యాచ్‌ నుంచి ఇదే ఫాలో అవుతున్నా. నేను బ్యాటింగ్‌ బాగా చేయగలనన్న నమ్మకం నాకు ఉంది.  స్పిన్నర్లు ఎప్పుడెప్పుడు బంతులేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటాను. వారి బౌలింగ్‌లో నా పని మరింత సులువుగా మారుతుంది’ అని రానా తెలిపాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement