భూపతిని ఎప్పటికీ గౌరవిస్తా: పేస్ | Sakshi
Sakshi News home page

భూపతిని ఎప్పటికీ గౌరవిస్తా: పేస్

Published Sun, Nov 20 2016 1:07 AM

భూపతిని ఎప్పటికీ గౌరవిస్తా: పేస్

 ముంబై: భారత టెన్నిస్‌కు రెండు కళ్లుగా భావించే లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎన్ని విజయాలు సాధించినా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. అయితే తన ఒకనాటి మిత్రుని గురించి పేస్ పెదవి విప్పాడు. తామిద్దరి మనస్తత్వాలు విభిన్నమని, భూపతిపై తనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు. ‘నేను, భూపతి భిన్న ధృవాలం. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నాం. మా ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అంటే చెప్పలేను.
 
  ఎందుకంటే ఇద్దరిదీ తప్పు ఉండొచ్చు.. ఇద్దరిదీ కరెక్టే అయి ఉండొచ్చు. ఆటలోనూ ఎవరి శైలి వారిదే. కానీ మా ఇద్దరి మధ్య గౌరవం ఉంది. వ్యక్తిగతంగా మేమెంతో సాధించాం. అది ఎక్కడికీ పోదు. నేను అతడితో కలిసి సాధించిన విజయాల కారణంగా భూపతిని కచ్చితంగా గౌరవిస్తాను’ అని ‘ఒలింపిక్ పతకం ఎలా గెలవాలి?’ అనే కార్యక్రమంలో పాల్గొన్న పేస్ తెలిపాడు. పేస్, భూపతి కలిసి గతంలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచారు.  
 

Advertisement
Advertisement