భారత మహిళలదే సిరీస్‌ 

Indian womens hockey team beat South Korea 2-1 - Sakshi

రెండో మ్యాచ్‌లోనూ కొరియాపై 2–1తో విజయం  

జిన్‌చియోన్‌ (కొరియా): ఈ సీజన్‌లో భారత మహిళల హాకీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇటీవల స్పెయిన్, మలేసియా పర్యటనల్లో ఆకట్టుకున్న టీమిండియా దక్షిణ కొరియాతో సిరీస్‌లోనూ తమ ఆధిపత్యం చాటుకుంది. కొరియాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 2–1తో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లోనూ భారత్‌ 2–1తో గెలిచిన సంగతి తెలిసిందే.

రెండో మ్యాచ్‌లో భారత్‌కు కొరియా నుంచి గట్టిపోటీ లభించింది. రెండు జట్లు దూకుడుగా ఆడటంతో తొలి క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్‌లు వచ్చాయి. అయితే ఇరు జట్లు ఈ అవకాశాలను వృథా చేసుకున్నాయి. అనంతరం 19వ నిమిషంలో లీ సెయుంగ్‌జు గోల్‌తో కొరియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో భారత క్రీడాకారిణులు సమన్వయంతో ఆడుతూ కొరియాపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 37వ నిమిషంలో కెప్టెన్‌ రాణి రాంపాల్‌ గోల్‌ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 50వ నిమిషంలో నవ్‌జ్యోత్‌ కౌర్‌ గోల్‌తో భారత ఆధిక్యం 2–1కి పెరిగింది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top