
భారత్-పాక్ మ్యాచ్:చర్చించాల్సిన అంశాలు
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాయాది పాకిస్తాన్ ను కసిదీరా కొట్టిన భారత్ జట్టు.. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. తొలుత పాకిస్తాన్ ను కుమ్మేసిన విరాట్ సేన.. ఆపై వారిని పేకమేడలా కూల్చేసి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకుంది.
1. రోహిత్ కీలక ఇన్నింగ్స్; చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ కు వ్యక్తిగత కారణాలతో దూరమైన రోహిత్.. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లో పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే రోహిత్ పై నమ్మకం ఉంచిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. పాకిస్తాన్ తో మ్యాచ్ లో చోటు కల్పించాడు. దీన్ని రోహిత్ నిలబెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ తో మెరిశాడు. తన సహజసిద్ధమైన దూకుడును పక్కను పెట్టి అత్యంత నిలకడగా బ్యాటింగ్ చేశాడు. తీవ్రమైన ఒత్తిడిని జయిస్తూ క్రీజ్ ను అంటిపెట్టుకుని స్ట్రైక్ రొటేట్ చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో బౌండరీలను సాధించాడు. 119 బంతుల్లో 91 పరుగులు చేసి చక్కటి ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ తో కలిసి 136 పరుగుల విలువైన భ్యాగస్వామ్యాన్ని అందించాడు. మరొకవైపు పాకిస్తాన్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.
2. యువరాజ్ జోరు; ప్రస్తుత భారత జట్టులో అత్యధిక ఐసీసీ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా యువరాజ్ సింగ్. 14 ఐసీసీ మ్యాచ్ లు ఆడిన ఘనత యువీ సొంతం. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ కు యువకుల్నినుంచి విపరీతమైన పోటీ నెలకొందనేది కాదనలేని వాస్తవం. దాంతో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టులో యువరాజ్ కు స్థానం దక్కుతుందని అనుకోలేదు. అయితే యువరాజ్ అనుభవం దృష్ట్యా అతనికి జట్టులో చోటు కల్పించారు. దీన్ని తొలి మ్యాచ్ లోనే ఘనంగా ఉపయోగించుకున్నాడు యువరాజ్. విధ్వంసకర బ్యాటింగ్ తో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో హాఫ్ సెంచరీ సాధించి ఆటకు వయసు అడ్డుకాదని నిరూపించాడు యువీ.
3. రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో; పాక్ తో మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ తనదైన మార్కుతో జట్టు భారీ గెలుపుకు సహకరించాడు. బౌలింగ్ లో అజహర్ అలీ, హఫీజ్ వికెట్లను ఖాతాలో వేసుకున్న జడేజా.. ఫీల్డింగ్ లో అదుర్స్ అనిపించాడు. ఒక క్యాచ్ ను అందుకోవడమే కాకుండా అద్భుతమైన రనౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 23 ఓవర్ లో షోయబ్ మాలిక్
బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ లో మరల్చి సింగిల్ తీసే క్రమంలో జడేజా రనౌట్ చేసిన నిజంగానే అద్భుతమనిపించింది. వేగంగా బంతిపైకి దూసుకొచ్చిన జడేజా అంతే వేగంగా వికెట్లపైకి నేరుగా విసిరి మాలిక్ ను పెవిలియన్ కు పంపాడు. మాలిక్ దూకుడుగా ఆడుతున్న సమయంలో అతను రనౌట్ కావడం పాక్ విజయావకాశాల్ని దారుణంగా దెబ్బ తీసింది.
4. రెండో ఓవర్ లోనే స్పిన్ ప్రయోగం; భారత్ ను కట్టడి చేయడానికి పాకిస్తాన్ ఆది నుంచే దూకుడునే ప్రదర్శించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ పై స్పిన్ ప్రయోగాన్ని ఆదిలోనే చేసింది పాకిస్తాన్. సహజంగా స్పిన్ ను బాగా ఆడే భారత్ జట్టుపైనే స్పిన్ మంత్రాన్ని ముందుగానే పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ప్రయోగించడం నిజంగానే సాహాసోపేత నిర్ణయం. ఇన్నింగ్స్ రెండో ఓవర్ ను స్పిన్నర్ ఇమాద్ వసీంకు అప్పగించడం ఇక్కడ ఆసక్తికరం.
5. పూర్తి కోటా వేయకుండానే; పాకిస్తాన్ ఘోర ఓటమికి ఆ జట్టులోని ఇద్దరు ప్రధాన బౌలర్లు పూర్తి కోటా వేయకపోవడం కూడా ఒక కారణం. మొహ్మద్ అమిర్, వహాబ్ రియాజ్ లు ఆట మధ్యలో గాయపడటంతో వారు పూర్తిగా బౌలింగ్ చేయలేకపోయారు. అమిర్ 8.1 ఓవర్లు వేసి స్టేడియానికి పరిమితమైతే, వహాబ్ రియాజ్ 8.4 ఓవర్లు వేశాడు. ఇవన్నీ నిన్నటి మ్యాచ్ లో మనకు కనిపించిన ప్రధాన అంశాలు.