ధోని జెర్సీ సైజు తగ్గింది! 

India cricket team new jersey released - Sakshi

ఫిట్‌గా మారానన్న మాజీ కెప్టెన్‌

టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆటపైనే కాకుండా... పెరుగుతున్న వయసు కారణంగా అతని ఫిట్‌నెస్‌పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ధోని తాను మరింత ఫిట్‌గా మారినట్లు చెప్పుకొచ్చాడు. టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా శరీరాన్ని మరింత ఫిట్‌గా ఉంచుకునేందుకు శ్రమించాను. ఇప్పటి వరకు  గీఔ సైజు జెర్సీతో భారీగా కనిపించేవాడిని. ఇప్పుడు అది  ఔకు మారింది. ఇకపై దీనిని కొనసాగిస్తా’ అని అతను అన్నాడు. ఇదే తరహాలో స్పందించిన కెప్టెన్‌ కోహ్లి తాను చాలా కాలంగా  ఔ వాడుతున్నానని, అది ఇకపై మారదని సరదాగా వ్యాఖ్యానించాడు. 2008 అండర్‌–19 ప్రపంచ కప్‌లో తాను అడగకుండానే ‘18’ నంబర్‌ జెర్సీ ఇచ్చారని... వరల్డ్‌ కప్‌ గెలుచుకోవడంతో పాటు తర్వాతా కలిసి రావడంతో అదే నంబర్‌ను కొనసాగించాను తప్ప ప్రత్యేక కారణమేదీ లేదని కోహ్లి వెల్లడించాడు. 

మరిన్ని ప్రత్యేకతలతో... 
భారత క్రికెట్‌ జట్టు అపెరల్‌ పార్ట్‌నర్‌ ‘నైకీ’ వచ్చే సీజన్‌ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. శుక్రవారం దీని ఆవిష్కరణ జరిగింది. నేటినుంచి జరిగే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు. గతంలోలాగే రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో ‘నైకీ’ దీనిని తయారు చేసింది. కొత్త జెర్సీలో రెండు రకాల బ్లూ షేడ్స్‌ ఉన్నాయి. గత జెర్సీతో పోలిస్తే ఒక ప్రధానమైన మార్పు కొత్తదాంట్లో కనిపించింది. మూడు ప్రపంచకప్‌ల గెలుపునకు సంకేతంగా ఇప్పటి వరకు ఎదపై కనిపించిన మూడు ‘స్టార్లు’ ఇకపై కాలర్‌ లోపలి వైపు కనిపిస్తాయి. పైగా తొలిసారి ఆ మూడు వరల్డ్‌ కప్‌ విజయాల (1983, 2007, 2011) తేదీలు, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ చేసిన స్కోర్లు దానిపై ముద్రించారు. అంతే కాకుండా ఆ మూడు ఫైనల్స్‌ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల భౌగోళిక స్థితి (అక్షాంశాలు–రేఖాంశాలు) కూడా దీనిపై ముద్రించడం మరో విశేషం. కార్యక్రమంలో కోహ్లి, ధోనిలతో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్, జెమీమా... టెస్టు ఆటగాళ్లు రహానే, పృథ్వీ షా కూడా పాల్గొన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top