ఐపీఎల్-2026 సీజన్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో చేరాడు. త్వరలోనే అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.
వరుసగా రెండో సీజన్లోనూ విజేతగా నిలవాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ స్టార్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-19వ సీజన్లోనూ ఆర్సీబీకీ కోహ్లి కీలకం కానున్నాడని డివిలియర్స్ తెలిపాడు. కాగా బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో విరాట్ది కీలక పాత్ర.
ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే జోరును విరాట్ కొనసాగించాలని ఏబీడీ కోరుకుంటున్నాడు.
"ఆర్సీబీకి విరాట్ కోహ్లి గుండెచప్పుడు లాంటి వాడు. కేవలం తన అద్భుతమైన బ్యాటింగ్తో మాత్రమే కాకుండా, అతడు చూపించే పట్టుదల, ఎనర్జీ జట్టులోని ఇతర ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి. మైదానంలోనూ, మైదానం వెలుపలా కోహ్లి వ్యవహరించే తీరు అమోఘం.
విరాట్ నుంచి యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు. కోహ్లి సృష్టించిన ఈ సానుకూల వాతావరణమే, గత సీజన్లో ఆర్సీబీ తన తొలి టైటిల్ నెగ్గడానికి ప్రధాన కారణం. అంతకుముందు సీజన్ వరకు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే ఆర్సీబీ ఆధారపడేది. కానీ ఇప్పుడు మాత్రం తొలి టైటిల్ గెలవడంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు" అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు.
చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే


