ఓటమి అంచుల నుంచి...

Hong Kong Open: Kidambi Srikanth advances, pv sindhu  knocked out - Sakshi

నాలుగు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని గెలిచిన శ్రీకాంత్‌

పోరాడి ఓడిన పీవీ సింధు

కౌలూన్‌ (హాంకాంగ్‌): ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా నాలుగు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ విజయం రుచి చూశాడు. హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో భాగంగా భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 18–21, 30–29, 21–18తో గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను గెల్చుకున్న ప్రణయ్‌ రెండో గేమ్‌లో నాలుగుసార్లు మ్యాచ్‌ పాయింట్లు సంపాదించాడు. కానీ పట్టుదల కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్‌ పలుమార్లు స్కోర్లను సమం చేశాడు. చివరకు 30–29తో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు.

మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మకు చైనా స్టార్‌ చెన్‌ లాంగ్‌ నుంచి ‘వాకోవర్‌’ లభించింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలైంది. సుంగ్‌ జీ హున్‌ (దక్షిణ కొరియా)తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 24–26, 20–22తో పోరాడి ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 17–21, 11–21తో లీ యాంగ్‌–సు యా చింగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో... పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సుమీత్‌ రెడ్డి–మను అత్రి (భారత్‌) జంట 16–21, 15–21తో లీ జె హుయె–లీ యాంగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయాయి.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top